పసిగట్టి ఉంటే జరిగి ఉండేది కాదు: అనురాధ దంపతుల హత్యపై చంద్రబాబు
చిత్తూరు: చిత్తూరు మేయర్ కటారి అనురాధ దంపతుల హత్య కేసులో మరో ఇద్దరిని అరెస్టు చేయాల్సి ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇప్పటికే ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆయన మీడియా ప్రతినిధులతో బుధవారం చెప్పారు.
అనురాధ దంపతుల హత్య విషయంలో నిఘా వైఫల్యం ఉందని చంద్రబాబు అన్నారు. ముందుగా పసి గట్టి ఉంటే హత్యలు జరిగి ఉండేవి కావని ఆయన అన్నారు.
మేయర్ దంపతులపై దాడి దురదృష్టకరమని ఆయన అన్నారు. హత్యలో భాగస్వాములు ఎంతటివారైనా సరే ఉపేక్షించేది లేదని ఆయన చెప్పారు. ప్రజా ప్రతినిధుల భద్రతపై పునస్సమీక్ష జరుపుతామని ఆయన చెప్పారు. చిత్తూరు మేయర్ కటారి అనురాధ, ఆమె భర్త మోహన్ల హత్య పథకం ప్రకారమే జరిగిందని ఆయన అన్నారు.
అందులో పోలీసుల వైఫల్యం లేదని చెప్పారు. హత్యా రాజకీయాలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. చిత్తూరులో రౌడీ మూకులు పెచ్చరిల్లకుండా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చెప్పారు.
చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్నచంద్రబాబు నాయుడు మేయర్ అనురాధ దంపతులకు నివాళులర్పించారు. నివాళులర్పించిన అనంతరం హత్యకు గల కారణాలపై ఆయన పోలీసులతో చర్చించారు. కాల్పుల ఘటన ప్రాంతాన్ని చంద్రబాబు పరిశీలించారు.
ఘటనకు సంబంధించి విషయాలపై ఐజీతో మాట్లాడారు. కారకులు ఎంతటివారైనా వదిలిపెట్టొద్దని, హత్యా రాజకీయాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని చంద్రబాబు ఐజీకి సూచించారు.