ఏవోబీలో భారీ ఎన్కౌంటర్: మావో సీనియర్ కమాండర్ చిన్నబ్బాయి మృతి
ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులు, పోలీసులకు మధ్య శనివారం తెల్లవారుజామున భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది.
విశాఖపట్నం: ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులు, పోలీసులకు మధ్య శనివారం తెల్లవారుజామున భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్లో ఏవోబీ దళానికి చెందిన సీనియర్ కమాండర్ మృతి చెందినట్లు పోలీసు వర్గాలు ధృవీకరించాయి.
మావోయిస్టుల కదలికలపై పక్కా సమాచారం అందుకున్న ఒడిశాకు చెందిన డీవీఎఫ్ బలగాలు మల్కన్గిరిజిల్లా చిత్రకొండ పోలీసుస్టేషన్ పరిధిలోని కప్పతొట్టి అటవీ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం నుంచి గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున మావోయిస్టులు తారసపడటంతో ఎదురు కాల్పులు జరిగాయి.
ఈ ఘటనలో ఏవోబీ డివిజన్ కమిటీ కలిమెల దళం కమాండర్ చిన్నబ్బాయి మృతిచెందినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఘటన స్థలంలో పెద్దఎత్తున పేలుడు పదార్థాలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
గాలింపుచర్యలు కొనసాగుతున్నట్లు మల్కన్గిరి ఎస్పీ మిత్రభాను మహాపాత్రో తెలిపారు. మావోకమాండర్ మృతదేహాన్ని మల్కన్గిరి జిల్లా కేంద్రానికి తరలించామని చెప్పారు.