అసెంబ్లీకి తొలి సారి గవర్నర్ బిశ్వభూషణ్ - వివేకా కేసుపైనా చర్చ : బీఏసీతోనే మొదలు..!!
ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాలు రేపు (సోమవారం) ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ సమావేశాలు గవర్నర్ స్పీచ్ తో మొదలు కానున్నాయి. ఇప్పటికే సీఎం జగన్ గవర్నర్ బిశ్వభూషణ్ ను కలిసి సమావేశాల నిర్వహణ పైన చర్చించారు. గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా సభలో ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి శాసనసభకు హాజరు కానున్నారు. కరోనా నేపధ్యంలో గతంలో జరిగిన బడ్జెట్ సమావేశాలలో గవర్నర్ ఆన్ లైన్ విధానంలో ఉభయసభలను ఉద్ధేశించి ప్రసంగించగా ఈ విడత ఆయన నేరుగా సభకు వచ్చి సభ్యులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

కీలక అంశాలకు సభ ద్వారానే
బడ్జెట్ సమావేశాలకు తొలుత హాజరు కాకూడదని భావించిన టీడీపీ ఆ తరువాత నిర్ణయం మార్చుకుంది. సమావేశాలకు హాజరు కానునున్నట్లు ప్రకటించింది. అయితే, టీడీపీ అధినేత - ప్రతిపక్ష నేత చంద్రబాబు మాత్రం సమావేశాలకు దూరంగానే ఉండాలని డిసైడ్ అయ్యారు. ఇక, ఈ సమావేశాల నిర్వహణ - అజెండా పైన గవర్నర్ ప్రసంగం తరువాత బీఏసీ సమావేశం కానుంది. అందులో అధికార - ప్రతిపక్షాల నుంచి అక్కడే అజెండా పైన చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నెలాఖరు వరకు సమావేశాలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 11వ తేదీన ఆర్దిక మంత్రి బుగ్గన సభలో 2022 -23 బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు.

న్యాయ - శాసన వ్యవస్థల పరిధిపైనా
ఈ సమావేశాల్లో అమరావతి గురించి దాఖలైన పిటీషన్ల పైన హైకోర్టు తీర్పు వెలువరించిన సమయంలో శాసనసభకు ఏపీ రాజధాని మార్చే అధికారం లేదంటూ చేసిన వ్యాఖ్యల పైన సభలో చర్చ చేపట్టాలని సీనియర్ నేత ధర్మాన ప్రభుత్వానికి లేఖ రాసారు. కోర్టు తీర్పు గురించి తాను మాట్లాడటం లేదని..శాసన వ్యవస్థకు రాజధాని గురించి చట్టం చేసే అధికారం లేదని చెప్పటం పైన ఆయన చర్చ కోరుకుంటున్నారు. అయితే, పార్లమెంట్ చేసిన చట్టం లో పేర్కొన్న అంశాల ఆధారంగానే కోర్టు పదే పదే రాజధాని మార్చే అధికారం లేదని చెప్పిందనేది ప్రతిపక్షాల వాదన. అయితే, ధర్మాన రాసిన లేఖ పైన బీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేసారు.

వివేకా హత్య కేసు పైనా చర్చ
అదే విధంగా ఇప్పుడు రాజకీయ వివాదంగా మారిన వైఎస్ వివేకా హత్య కేసు పైనా చర్చించటానికి అధికార వైసీపీ సిద్దం అవుతోంది. టీడీపీ బయట చేస్తున్న విమర్శలకు సభ ద్వారా సమాధానం చెప్పాలని భావిస్తోంది. దీంతో..పాటుగా టీడీపీ రాష్ట్రంలోని పలు అంశాల పైన చర్చకు పట్టు బట్టే అవకాశం ఉంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు.. అదే విధంగా వివేకా హత్య కేసు పైన చర్చ..ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం సమయంలో సీఎం జగన్ తన ప్రసంగంలో కీలక అంశాలను ప్రస్తావించే ఛాన్స్ ఉంది. ఇక, ఈ నెల 8వ తేదీన హఠాన్మరణం చెందిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి సభ సంతాపం తెలుపుతూ తీర్మానం చేయనుంది. అదే రోజు మహిళా దినోత్సవం కావటంతో.. సభలోని మహిళా సభ్యులకు మాట్లాడే అవకాశం కల్పించాలని నిర్ణయించారు.












Click it and Unblock the Notifications