ఏపీ డిప్యూటీ స్పీకర్కు కరోనా పాజిటివ్: హోంక్వారంటైన్లోకి కోన రఘుపతి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు కరోనా బారినపడుతున్నారు. తాజాగా, ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది.
తనకు కరోనా పాజిటివ్ వచ్చిన కోన రఘుపతి ఓ వీడియో ద్వారా వెల్లడించారు. తన ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఎవరూ బాధపడవద్దని సూచించారు. వైద్యుల సూచన మేరకు తాను వారంపాటు హోంక్వారంటైన్లో ఉంటానని రఘుపతి తెలిపారు. కాగా, శనివారం కరోనా బారినపడి మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత పైడికొండల మాణిక్యాలరావు మృతి చెందిన విషయం తెలిసిందే.
లక్ష 60వేల దిశగా ఏపీ కరోనా కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో ఆదివారం కొత్తగా 8555 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,58,764కి చేరింది. కాగా, గత 24 గంటల్లో 6272 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 82,886 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
రాష్ట్రంలో గత 24 గంటల్లో 52,834 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 20,65,407 నమూనాలను పరీక్షించామని వెల్లడించింది. కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో 74,404 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. గత 24గంటల్లో కరోనా బారినపడి 67 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 1474కు చేరింది.