ఇలాచేద్దాం: సీమాంధ్ర నేతలకు కిరణ్ హితబోధ, డిగ్గీ బిజీ
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సీమాంధ్ర ప్రాంత నేతలతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కిరణ్ కుమార్ రెడ్డిని మొదట తెలంగాణ ప్రాంత నేతలు కలిసి త్వరగా తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో చర్చకు వచ్చేలా చేయాలని కోరారు. తెలంగాణ నేతల అనంతరం సీమాంధ్ర నేతలు ముఖ్యమంత్రిని కలిశారు.
వారితో కిరణ్ విభజనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీమాంధ్ర నేతలను ఎవరూ విడదీయలేరని, అసెంబ్లీలో ఎవరి ప్రాంతానికి అనుగుణంగా వారు అభిప్రాయాలు చెప్పవచ్చునని స్పష్టం చేశారు. 371డిని సవరించాలని బిల్లులో ఉందన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మూడింట రెండొంతుల మెజారిటీ సాధించడం అసాధ్యమన్నారు. తెలంగాణ బిల్లు చర్చకు వచ్చినప్పుడు అవసరమైతే ప్రతి అంశంపై ఓటింగుకు డిమాండ్ చేద్దామని సూచించారు. కాగా, రాష్ట్రానికి వచ్చిన తెలంగాణ బిల్లును ముఖ్యమంత్రి గురువారం రాత్రి క్షుణ్ణంగా పరిశీలించారు.

డిగ్గీ వరుస భేటీలు
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ శుక్రవారం ఉదయం రాజ్ భవన్లో గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యారు. వారిరువురు అరగంటపాటు తెలంగాణ బిల్లు పైన చర్చించారు. గవర్నర్తో జరిగిన భేటీలో డిగ్గీతో పాటు ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ మరికొందరు నేతలు ఉన్నారు. అసెంబ్లీకి తెలంగాణ బిల్లు వస్తున్న నేపథ్యంలో ఎదురయ్యే పరిణామాలపై చర్చించారని తెలుస్తోంది. గవర్నర్తో భేటీ అనంతరం దిగ్విజయ్ గాంధీ భవన్కు చేరుకున్నారు. అక్కడ కాంగ్రెసు పార్టీ నేతలతో భేటీ అయ్యారు.
తెలంగాణ ముసాయిదా బిల్లుపై వెంటనే సభలో చర్చ చేపట్టాలని తెరాస శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. శుక్రవారం అసెంబ్లీ లాబీలో మీడియాతో మాట్లాడుతూ రెండు రోజుల్లో చర్చ ముగించి ముసాయిదా బిల్లు కేంద్రానికి పంపాలని ఈటెల సూచించారు. ముఖ్యమంత్రి రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలన్నారు. బిల్లుపై ఈరోజే చర్చకు వస్తుందన్నారు.
తెలుగుదేశం పార్టీదీ విభజనపై రెండు నాల్కల ధోరణి అని కాంగ్రెసు పార్టీ శాసనమండలి సభ్యులు యాదవ రెడ్డి అన్నారు. తెలంగాణ బిల్లును వెంనటే ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications