ఆర్డినెన్స్ కోసమే ఏపీ అసెంబ్లీ, మండలి ప్రోరోగ్, బడ్జెట్ సమావేశాల్లో బిల్లు పెట్టాల్సిందే: టీడీపీ
అసెంబ్లీ, శాసనమండలి ప్రోరోగ్ అంశం ఏపీలో హాట్ టాపిక్ అయ్యింది. ఉభయ సభలను గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రోరోగ్ చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ప్రతిపక్ష టీడీపీలో విసృత చర్చ జరుగుతోంది. భవిష్యత్ కార్యాచరణపై ముమ్మరంగా చర్చిస్తోంది.
ఆర్డినెన్స్.. కానీ
ప్రొరోగ్తో ఆర్డినెన్స్ ఇచ్చేందుకే మాత్రమే వెసులుబాటు ఉంది. కానీ కొన్ని నిబంధనలు ఉన్నాయని గుర్తుచేస్తోంది. సభ జరిగే సమయంలో ఆర్డినెన్స్ తీసుకొస్తే.. సభలో బిల్లు ప్రవేశపెట్టాలని కోరుతోంది. బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం విధిగా బిల్లు పెట్టాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. సభ జరిగే సమయంలో బిల్లుగా పెట్టాలని స్పష్టంచేసింది.
ఉభయ సభలకు..
అంతేకాదు కోర్టులో ఉన్న అంశంపై ఆర్డినెన్స్ తీసుకొస్తే కోర్టు పరిధిలోకి వస్తోందని టీడీపీ వాదిస్తోంది. మండలి రద్దు జరిగే వరకు మండలి సమావేశాలు జరపాల్సిందేనని కుండబద్దలు కొట్టీ మరీ చెబుతోంది. వికేంద్రీకరణ, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లు మళ్లీ అసెంబ్లీ, మండలికి రావాల్సిందేనని మండలి విపక్ష నేత యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. మండలి సమావేశం లేకుండా బడ్జెట్ సమావేశాలు నిర్వహించొద్దని, కానీ జగన్ సర్కార్ నియమ, నిబంధనలను తుంగలో తొక్కే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు.
ప్రోరోగ్..
ఏపీ అసెంబ్లీ, శాసనమండలిని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రోరోగ్ చేశారు. ఈ మేరకు గురువారం నోటిఫికేషన్ జారీచేశారు. వికేంద్రీకరణ, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లులకు ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చేందుకు అసెంబ్లీ ప్రోరోగ్ చేస్తున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి.
గతంలో కూడా..
ఇప్పుడే కాదు గతంలో కూడా సభలను ప్రోరోగ్ చేశారని ఏపీ ప్రభుత్వం గుర్తుచేస్తోంది. ట్రిపుల్ తలాక్, భూ సేకరణ చట్టం ఆర్డినెన్స్ తీసుకొచ్చే సమయంలో లోక్సభ, రాజ్యసభలను ప్రోరోగ్ చేస్తున్నామని గుర్తుచేశారు. అంతేకాదు రాజ్యసభ నడుస్తోండగానే ఆర్డినెన్స్ తీసుకొచ్చిన దాఖలాలు ఉన్నాయని చెబుతున్నాయి. గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించిన విధానానా ఫాలో అవుతామని చెప్పారు.