నిమ్మగడ్డపైన ప్రివిలేజ్ చర్యలు తప్పవా : తాజా నిర్ణయాలతో ఉత్కంఠ : ఆయన నిర్ణయమే కీలకం..!!
మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ పైన ప్రివిలేజ్ కమిటీ ఏం సిఫార్సు చేయబోతోంది. ఆయన వివరణతో కమిటీ ఈ వ్యవహారాన్ని వదిలేస్తుందా..లేక, చర్యల దిశగా నిర్ణయాలు ఉంటాయా. ఇప్పుడు ఈ అంశం పొలిటికల్ గా హాట్ టాపిక్ అయింది. తాజాగా టీడీపీ శాసనసభా ఉప నేతలు అచ్చెన్నాయుడు..రామానాయుడు పైన ప్రివిలేజ్ కమిటీ సంచలన సిఫార్సుకు సిద్దమైనట్లుగా తెలుస్తోంది. ఇక, ప్రస్తుత శాసన సభా కాల పరిమితి ముగిసే వరకూ వారిద్దరికీ సభలో మాట్లాడే అవకాశం లేకుండా చేయాలని ప్రివిలేజ్ కమిటీ అసెంబ్లీకి సిఫార్సు చేస్తుందని తెలుస్తోంది.
దీంతో..ప్రభుత్వం వర్సెస్ నిమ్మగడ్డ అన్నట్లుగా సాగిన వ్యవహారంలో నాడు వైసీపీ నేతలు సైతం జోక్యం చేసుకున్నారు. ఎన్నికల వాయిదా వ్యవహారంలో సాగిన వివాదం ఆయన పదవీ విరమణతో ముగిసింది. కానీ, ఆయన ఎన్నికల కమిషనర్ గా ఉన్న సమయంలో ఇద్దరు మంత్రుల పైన గవర్నర్ కు లేఖ రాసారు. తమ పైన ఎన్నికల కమిషనర్ చేసిన వ్యాఖ్యల పైన ఇద్దరు మంత్రులు స్పీకర్ కు ఫిర్యాదు చేసారు. ఆయన ఆ ఫిర్యాదును ప్రివిలేజ్ కమిటీకి పంపారు. దీంతో.. కమిటీ మాజీ ఎస్ఈసీకి నోటీసులు పంపింది.
దీని పైన సమాధానం ఇచ్చిన ఆయన తనకు శాసనసభ్యుల పైన..సభ పైన గౌరవం ఉందని..మరింత సమాచారం ఇస్తే వాటి పైన వివరణ ఇస్తానంటూ అందులో పేర్కొన్నారు. దీంతో..ప్రివిలేజ్ కమిటీ మరింత సమాచారంతో ఆయనకు లేఖ పంపింది. అయితే, న్యాయవ్యవస్థలో విచారణ ఉందనే కారణంగా..ప్రివిలేజ్ కమిటీ విచారణ ఆపాల్సిన అవసరం లేదని కమిటీ ఛైర్మన్ స్పష్టం చేసారు. నిమ్మగడ్డ అవగాహన లోపం..అనుభవరాహిత్యంతోనే ఆ రకంగా చెప్పి ఉండవచ్చని ఆయన అభిప్రాయ పడ్డారు.
నిమ్మగడ్డ నుంచి పూర్తిగా సమాధానం వచ్చిన తరువాత ఆయన ఇచ్చే సమాధానం తో ఆ విషయాన్ని ఇక వదిలేయాలా..లేక చర్యలు తీసుకోవాలా అనే అంశం పైన నిర్ణయం తీసుకుంటామని తేల్చి చెప్పారు. అయితే, తాను ఎక్కడా సభ్యులను గౌరవాన్ని తగ్గించేలా వ్యవహరించ లేదని నిమ్మగడ్డ చెబుతున్నారు. అయితే, అధికారంలో ఉన్న ఎన్నికల కమిషనర్ పైనే మహారాష్ట్ర అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ విచారణ జరిపి స్పీకర్ కు నివేదిక ఇచ్చిన విషయాన్ని వైసీపీ సభ్యులు గుర్తు చేస్తున్నారు. దీంతో..ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పుడు నిమ్మగడ్డ నుంచి వచ్చే సమాధానం కీలకం కానుంది.
Recommended Video
ఆ సమాధానం పైన ఫిర్యాదు చేసిన మంత్రుల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న తరువాత ప్రివిలేజ్ కమిటీ సమావేశమై తమ నిర్ణయాన్ని ఫైనల్ చేయనుంది. దీనిని అసెంబ్లీ స్పీకర్ కు నివేదించనుంది. ఆ సిఫార్సుల ఆధారంగా స్పీకర్ తుది నిర్ణయం తీసుకుంటారు. ఇక, ఇప్పుడు ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేల పైన ప్రివిలేజ్ కమిటీ కీలక సిఫార్సులకు సిద్దమైందనే వార్తల నేపథ్యంలో నిమ్మగడ్డ వ్యవహారంలోనూ ప్రివిలేజ్ కమిటీ నిర్ణయం ఆసక్తి కరంగా మారుతోంది.