ఏపీలోనే: నాగార్జున వర్సిటీలో అసెంబ్లీ సమావేశాలు!
హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సమావేశాలను గుంటూరు జిల్లా నాగార్జున విశ్వవిద్యాలయంలో నిర్వహించాలని భావిస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లోనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది.
ఈ మేరకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో డిసెంబర్ 3వ వారంలో సమావేశాలు నిర్ణయించడంతోపాటు సోమవారం అక్కడ ఏర్పాట్లను పరిశీలించేందుకు సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాద్తోపాటు అసెంబ్లీ సిబ్బంది అంతా వర్శిటీకి రానున్నారు.యూనివర్శిటీలోని డైక్మెన్ హాలులో సమావేశాలను నిర్వహించనున్నారు.
ఈ మేరకు వర్శిటీ వైస్ ఛాన్సలర్కు కూడా ఈ విషయం ప్రభుత్వం తెలియజేసింది. ఆరు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. నాగార్జున యూనివర్శిటీకి ఎదురుగా ఉన్న రెయిన్ ట్రీ పార్క్, విల్లాలు, విజయవాడ, గుంటూరులలో మంత్రులకు, ఎమ్మెల్యేలకు వసతి ఏర్పాటు చేయనున్నారు.
అసెంబ్లీ సమావేశాలు నాగార్జున విశ్వవిద్యాలయంలో జరపాలని భావిస్తున్నట్లు కోడెల ఈ సందర్భంగా తెలిపారు. సోమవారం భవనాన్ని పరిశీలించి నివేదిక ఇస్తామని చెప్పారు. సౌకర్యాలు ఉన్నాయని భావిస్తే డిసెంబర్ మాసంలో శీతాకాల సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు.
ఉద్యోగుల బదిలీలకు మరో వారం గడువు
ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల గడువు పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారు. బదిలీలకు ప్రభుత్వం ఇచ్చిన గడువు ఈ నెల 15వ తేదీతో ముగియగా, మరో వారం రోజులు పొడిగించారు. దీంతో ఈ నెల 22 వరకూ ఉద్యోగుల బదిలీలు నిర్వహించుకోవచ్చు.
గత నెలలోనే బదిలీలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా.. జన్మభూమి- మా ఊరు కార్యక్రమం చేపట్టడంతో ప్రభుత్వం తాత్కాలిక నిషేధం విధించింది. ఈ నెల 12వ తేదీ నుంచి బదిలీలు పున:ప్రారంభమైనప్పటికీ 15వ తేదీలోపు పూర్తి చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.
దీంతో సమయం చాలక ఉద్యోగులు ఆయా శాఖల చుట్టూ హడావుడి పడిపోయారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కేవలం మూడు రోజుల సమయంలో బదిలీలు నిర్వహించుకోవడం కొంత కష్టమని వారం రోజుల సమయం ఇవ్వాలని చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. దీంతో గడువు పొడిగిస్తూ సీఎం ఉత్తర్వులు జారీ చేశారు.