ఈసారి 'ఫటాఫట్' మంత్ర.. జగన్ కీలక నిర్ణయం.. మునుపెన్నడూ లేని రీతిలో...
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈసారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు భిన్నంగా జరగనున్నాయి. ఉభయ సభల సమావేశాలను ఈసారి కేవలం 2 రోజులకే కుదించబోతున్నట్టు తెలుస్తోంది. మొదటిరోజు గవర్నర్ ప్రసంగం,అదే రోజు ధన్యవాద తీర్మానం ఉంటాయని సమాచారం. అంతేకాదు,రాష్ట్ర బడ్జెట్ను కూడా అదే రోజు ప్రవేశపెడుతారని తెలుస్తోంది. ఆదే రోజు బడ్జెట్కు సభా ఆమోదం పొంది.. మరుసటి రోజు కొన్ని బిల్లులు ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం.
జగన్ అలా ప్రమాణం చేశారు కానీ.: అక్రమ కేసులు, జైలుకు పంపడాలు అందుకే..
రాజ్భవన్ నుంచే ప్రసంగించనున్న గవర్నర్..
ఈ నెల 16వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే కరోనా నేపథ్యంలో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఈసారి అసెంబ్లీకి రావట్లేదు. రాజ్భవన్ నుంచే ప్రత్యేక వీడియో సౌకర్యం ద్వారా ఆయన ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ ప్రసంగం గంట సేపు ఉంటుందని అంచనా. గవర్నర్ ప్రసంగం ముగిసిన వెంటనే బీఏసీ సమావేశమై సభా కార్యక్రమాలపై చర్చిస్తుంది. ఆ తర్వాత గంట సేపటికే ఉభయ సభల సమావేశాలు తిరిగి ప్రారంభమవుతాయి.
ఆ వెంటనే ధన్యవాద తీర్మానం.., బడ్జెట్..
ఉభయ సభలు తిరిగి ప్రారంభం కాగానే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ప్రవేశపెడుతారు. ఈ సందర్భంగా కచ్చితమైన సమయ పాలనను పాటిస్తూ సభలు నిర్వహిస్తారు. నిర్దేశిత సమయాన్ని బట్టి సభ్యులను చర్చకు అనుమతిస్తారు. ఆ వెంటనే తీర్మానాన్ని ఆమోదిస్తారు. అనంతరం ఉభయ సభల్లో బడ్జెట్ను ప్రవేశపెడుతారు. ఆ వెంటనే దానిపై చర్చ ప్రారంభించడం,ఆమోదించడం చకచకా జరిగిపోతాయి. నిజానికి మొదట శాసనసభలో బడ్జెట్ను ప్రవేశపెట్టి.. అక్కడ ఆమోదం పొందాక.. మూడో రోజు మండలిలో బడ్జెట్ను ప్రవేశపెట్టాలని తొలుత భావించినట్టు తెలుస్తోంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సరైంది కాదని,ఉభయసభల్లో ఒకేసారి బడ్జెట్ ప్రవేశపెట్టి ఆమోదం పొందాలని ప్రభుత్వం భావిస్తోంది.
17వ రోజు సభ ముందుకు బిల్లులు...
ఇక 17వ తేదీన ప్రభుత్వం కొన్ని బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అదే రోజు ఉభయ సభల్లో దశల వారీగా ప్రభుత్వ శాఖల పద్దులను, ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదిస్తారు. ఈ బిల్లులన్నింటికీ దాదాపుగా అదేరోజు ఆమోద ముద్ర పడేలా చేస్తారు. అంతా అనుకున్నట్టుగా జరిగితే కేవలం రెండు రోజుల్లోనే సమావేశాలు పూర్తవుతాయి. ఈ ఏడాది మార్చిలో బడ్జెట్ సమావేశాలను నిర్వహించలేకపోవడంతో.. ఏప్రిల్-జూన్ వ్యయాన్ని గవర్నర్ ఆర్డినెన్స్ ద్వారా పొందారు. జులై నుంచి వ్యయానికి బడ్జెట్ ఆమోదం తప్పనిసరి. ఈ నేపథ్యంలో 16,17 తేదీల్లో సమావేశాలు నిర్వహించనున్నారు.
Recommended Video
మునుపెన్నడూ లేని అసాధారణ పరిస్థితుల నడుమ..
కరోనా వైరస్ తీవ్ర ఆందోళన రేపుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. సభలను ఎక్కువ రోజులు కొనసాగించడం మంచిది కాదని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే సాధారణంగా 14 రోజుల పాటు జరిగే సమావేశాలను కేవలం 2 రోజులకే కుదించాలని భావిస్తోంది. భౌతిక దూరం,మాస్కులు,శానిటైజేషన్ తదితర జాగ్రత్తలు తీసుకుంటూ సమావేశాలను నిర్వహించనున్నారు. అటు ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో గానీ,ఇటు ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత గానీ మునుపెన్నడూ ఇలాంటి అసాధారణ పరిస్థితుల్లో అసెంబ్లీ నిర్వహించలేదు.