మంత్రి కుమారుడు మహిళ చేయి పట్టి లాగితే..: జగన్, వైయస్లా హీనుడ్ని కాదు: రావెల
హైదరాబాద్: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఏపీ శాసనసభ తీర్మానం చేసింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా అభ్యున్నతిపై సభలో చర్చ చేపట్టారు.
అనంతరం మహిళలకు రిజర్లేషన్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీర్మానం ప్రవేశపెట్టారు. 33 శాతం రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తూ సభ తీర్మానాన్ని ఆమోదించింది.
జగన్ వర్సెస్ రావెల
ఓ వ్యక్తి మహిళను కారులోకి లాక్కొని, బలాత్కారం చేయబోతే ఆ వ్యక్తి నాన్న దాని గురించి ఏం మాట్లాడారని జగన్ ప్రశ్నించారు.
రావెల మాట్లాడుతూ.. మహిళల హక్కులకు, స్వేచ్ఛ ఇచ్చిన పార్టీ టిడిపిది అన్నారు. నా కుమారుడు తప్పు చేసి ఉంటే ఏ శిక్ష వేసినా తాను సిద్ధమని చెప్పానని చెప్పారు. తన కొడుకుపై ఆరోపణలు చేసిన యువతి తనకు కూతురులాంటిది అని చెప్పానన్నారు.
తన కొడుకైనా, ఇంకెవరైనా ఆ యువతి పట్ల అలాంటి చర్యకు పాల్పడితే ఏ శిక్ష విధించేందుకైనా సిద్ధమన్నారు. తన కొడుకును తానే స్వయంగా పోలీస్ స్టేషన్లో అప్పగించానని చెప్పారు. తప్పు చేశాడా లేదా విచారించాలని తాను పిఎస్లో అప్పగించానని చెప్పారు.
జగన్.. పరిటాల రవి హత్య కేసులో నిందితుడు అని ఆరోపించారు. ఆ సమయంలో వైయస్ మాట్లాడుతూ.. తన కొడుకు అమాయకుడని, కేసులో ఇరికించవద్దని చెప్పారని గుర్తు చేశారు. కేసు నుంచి జగన్ పేరును తొలగించేలా చేశారన్నారు.
నేను మాత్రం వైయస్ రాజశేఖర రెడ్డిలా తన కొడుకును తప్పించాలని ప్రయత్నాలు చేయలేదన్నారు. నేను విచారణకు సిద్ధమన్నారు. పరిటాల రవి కేసులో తప్పించుకోవడానికి ప్రయత్నించిన హీనచరిత్ర వైయస్ రాజశేఖర రెడ్డిది అన్నారు.
జగన్ మాట్లాడుతూ... తన కొడుకు ఇంత దారుణమైన తప్పు చేస్తే దానికి కూడా జగన్ పైన ఆరోపణలు చేస్తే, ఇలాంటి మంత్రిని ఇంకా చంద్రబాబు కొనసాగిస్తున్నారంటే దానికి మనం తల వంచుకోవాలన్నారు.
ఎదురుకట్నం ఇచ్చే రోజులు రానున్నాయి: చంద్రబాబు
రాష్ట్రంలో మహిళల సంఖ్య తగ్గుతోందన్నారు. అన్ని రంగాలలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో 49.8 శాతం మహిళలు ఉన్నారని చెప్పారు. తమ ప్రభుత్వం మహిళలకు 33 శాతం ఉద్యోగాలు కల్పిస్తోందన్నారు. త్వరలో ఎదురుకట్నం ఇచ్చే రోజులు రానున్నాయని చెప్పారు.
టిడిపి హయాంలోనే మహిళలకు న్యాయం జరిగిందన్నారు. మహిళలు సొంతగా సంపాదించే మార్గాలు అన్వేషిస్తున్నామన్నారు. దేశంలో పదివేల కోట్లు డ్వాక్రా రుణాలు ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందన్నారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు తీసుకు వచ్చింది స్వర్గీయ ఎన్టీఆర్ అన్నారు.
పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని ఐటీ కంపెనీల్లో మహిళలకు ప్రాధాన్యత ఇంకా పెరగవలసి ఉందని చెప్పారు. మహిళలను అన్ని రంగాల్లో పైకి తీసుకు వస్తామన్నారు. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో మహిళలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు.
ఐరాస 2030 నాటికి మహిళలు, పురుషులు సమానత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. తాము తీసుకు వచ్చిన డ్వాక్రా సంఘాలు ఓ వినూత్న కార్యక్రమం అన్నారు. ఇంటికొకరిని చేర్పించామన్నారు. రాష్ట్రంలో 8 లక్షలకు పైగా డ్వాక్రా సంఘాలు ఉన్నాయన్నారు. మహిళలకు రూ.10వేల కోట్లు ఇవ్వడం చరిత్ర అన్నారు.
అన్ని ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ప్రత్యేక సీట్లు ఉన్నాయన్నా్రు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ఆన్ కాల్ ట్యాక్సీ విధానం అన్నారు. ఆన్ కాల్ ట్యాక్సీని పర్యవేక్షించేందుకు కంట్రోల్ రూం ఉంటుందన్నారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన వారికి పురస్కారాలు ఇస్తామన్నారు. మహిళలకు ఉచితంగా సంపూర్ణ ఆరోగ్య పరీక్షలు అన్నారు.
ప్రశ్నోత్తరాల సమయంలో జగన్, అచ్చెన్న వాగ్వాదం
ఉదయం సభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలు ప్రారంభమయ్యాయి. మంత్రి అచ్చెన్నాయుడు ఓ ప్రశ్నకు సమాధానంగా... విద్యుత్ ఆదా కోసం రాష్ట్రవ్యాప్తంగా ఎల్ఈడీ బల్బుల ఉపయోగాన్ని పెంచామని, వీధి దీపాలు పెట్టామన్నారు.
13 జిల్లాల్లో క్రీడా మైదానాలు నిర్మిస్తామన్నారు. ప్రతి జిల్లాలో జాతీయ క్రీడలు జరిగేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. స్టేడియాల నిర్మాణంలో నాణ్యతా లోపాలు ఉంటే చర్యలు తీసుకుంటామని చెప్పారు.
జగన్ మాట్లాడుతూ... బొగ్గు నుంచి కరెంట్ వరకు రాష్ట్రంలో కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ఎల్ఈడీ బల్పుల కొనుగోలులో స్కాం జరిగిందన్నారు. కేంద్ర సంస్థలను ముందు పెట్టి అవకతవకలకు పాల్పడుతున్నారన్నారు. ప్రతిపక్షం అడిగే ప్రశ్నలకు అధికార పార్టీ డొంక తిరుగుడు సమాధానం చెబుతోందన్నారు.
జగన్ ఆరోపణలను మంత్రి అచ్చెన్నాయుడు ఖండించారు. జగన్, వైసిపి నేత బొత్స సత్యనారాయణ వంటి వారికి అవినీతిపై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. ప్రతిపక్షం అడిగే ప్రతి ప్రశ్నకు తాము సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.