ఈ నెల 15 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..!!
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. వారం రోజుల పాటు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయించింది. సమావేశాల తొలి రోజున జరిగే బీఏసీ సమావేశంలో సభ అజెండాను ఖరారు చేయనున్నారు. ఈ సమావేశాల్లో ప్రభుత్వం ఈ మూడున్నారేళ్ల కాలంలో అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి ప్రధానంగా చర్చ చేయాలని భావిస్తోంది. అదే విధంగా పోలవరం - పునారావాస ప్యాకేజీ పైన సభలోనే చర్చించాలని నిర్ణయించినట్లుగా సమాచారం.
అదే విధంగా పోలవరం ప్రాజెక్టులో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు.. గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాల గురించి సభ ద్వారా ప్రజల ముందు ఉంచాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో పాటుగా ప్రతిపక్షాలు నిత్యావసర ధరలు.. శాంతి భద్రతల పైన చర్చకు డిమాండ్ చేయనున్నారు. వీటి పైన చర్చకు సిద్దమని ప్రభుత్వం చెబుతోంది. మూడు రాజధానుల బిల్లులను మరోసారి ప్రభుత్వం సభ ముందుకు తీసుకొస్తుందనే ప్రచారం సాగుతోంది. అయితే, హైకోర్టు అమరావతికి అనుకూలంగా తీర్చు ఇవ్వటంతో.. ప్రభుత్వం న్యాయ పరంగా అడ్డంకులను పరిష్కరించుకున్న తరువాత మాత్రమే మూడు రాజధానుల వ్యవహారంలో ముందడుగు వేసే అవకాశం ఉందని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు.
ఇక, రాష్ట్రంలో అమలు చేస్తున్న సామాజిక న్యాయం పైన సభలో చర్చ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఏపీ అర్దిక పరిస్థితి గురించి చర్చకు ప్రతిపక్షాలు డిమాండ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు ఈ సమావేశాలకు దూరంగానే ఉండనున్నారు. రెండు ప్రధాన పార్టీలు రాజకీయంగా ఎన్నికల దిశగా ముందస్తుగానే సిద్దం అవుతున్న వేళ..శాసనసభా వేదికగా కొత్త వ్యూహాలతో ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.