అలిగిన అయ్యన్న-అసెంబ్లీలో చర్చకు పెడతా- స్పీకర్ పదవినైనా వదులుకుంటానంటూ..!
ఏపీలో అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తీరే వేరు. టీడీపీలో సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన ఆయనకు ఏదైనా ముక్కుసూటిగా మాట్లడతారనే పేరుంది. అయ్యన్నపాత్రుడు పలు సందర్భాల్లో రాజకీయ ప్రత్యర్థులైన జగన్, ఇతరులపై చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఇప్పుడు మరోసారి ఆయన తన నియోజకవర్గం నర్సీపట్నంలో ఓ భూమి వ్యవహారానికి సంబంధించి అలిగి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.
నర్సీపట్నం ఆర్టీసీ డిపోకు చెందిన స్థలాల్ని ప్రైవేటు వ్యక్తులకు లీజుకు ఇచ్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై స్పీకర్ అయన్నపాత్రుడు ఫైర్ అయ్యారు. స్పీకర్ పదవినైనా వదులుకుంటా కానీ నర్సీపట్నం డిపోలో ఉన్న ఆర్టీసీ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు లీజు కు ఇస్తే అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. పెద్ద ఎత్తున మట్టిని తరలిస్తుంటే ఆర్టీసీ సెక్యూరిటీ ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. రోడ్డుమీద పహారా కాస్తున్న పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీశారు. ఆర్టీసీ సెక్యూరిటీ సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేయాలన్నారు.

తాను నాలుగు సార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎందుకు ఎత్తలేదంటూ ఆర్టీసీ డీఎం ధీరజ్ ని అయ్యన్న ఇవాళ నిలదీశారు. రైతులు ప్రజల అవసరాల కోసం భూమి ఇచ్చారని, వ్యాపార అవసరాల కోసం ఆర్టీసీ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు మల్టీ కాంప్లెక్స్ నిర్మాణానికి లీజ్ కి ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. తాను వద్దంటున్నా ఎందుకు లీజు దారులకు అధికారులు ఇస్తున్నారంటూ కడిగేశారు. దీంతో అధికారులు కూడా అవాక్కయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడతానని, అవసరమైతే అసెంబ్లీలో చర్చకు పెడతానని అయ్యన్న హెచ్చరించారు.












Click it and Unblock the Notifications