AP Assembly : పోడియంలోకి వస్తే ఆటోమేటిక్ సస్పెన్షన్-స్పీకర్ తమ్మినేని సంచలన రూలింగ్..
ఏపీ అసెంబ్లీలో విపక్ష సభ్యులు ఇవాళ కూడా పోడియంలోకి వచ్చి నిరసనలు తెలిపి సస్పెండైన నేపథ్యంలో ఇలాంటి పరిస్ధితుల్ని అరికట్టేందుకు స్పీకర్ తమ్మినేని కీలక నిర్ణయం తీసుకున్నారు.
అమరావతి : ఏపీ అసెంబ్లీలో వైసీపీ వర్సెస్ టీడీపీ పోరు పతాకస్ధాయికి చేరుకుంది. అసెంబ్లీ బడ్డెట్ సమావేశాల్లో భాగంగా ఇవాళ జీవో నంబర్ 1 రద్దు కోసం వాయిదా తీర్మానం ఇచ్చిన టీడీపీ సభ్యులు.. దాన్ని స్పీకర్ తిరస్కరించడంతో సభలోనే నిరసనకు దిగారు. ఈ నేపధ్యంలో చోటు చేసుకున్న వాగ్వాదం అనంతరం వైసీపీ, టీడీపీ సభ్యులు పరస్పరం చేయిచేసుకున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు వేసిన స్పీకర్.. అనంతరం కీలక నిర్ణయం ప్రకటించారు.
అసెంబ్లీలో సభ్యులంతా తనకు సమానమేనని స్పీకర్ తమ్మినేని తెలిపారు. విపక్షానికి కూడా మాట్లాడే అవకాశం ఇస్తానని చెప్పానని, అయితే తొలి రోజు నుంచి టీడీపీ సభ్యులు వ్యక్తిగత దూషణలకు దిగారని ఆయన తెలిపారు. ముఖ్యంగా టీడీపీ ఎమ్మెంల్యే డోలా బాలవీరాంజనేయస్వామి ప్రతి రోజూ తీవ్రస్థాయిలో దూషిస్తున్నారని ఆరోపించారు. గవర్నర్ అసెంబ్లీలో ప్రసంగం కోసం వచ్చినప్పుడు, రాజ్భవన్ నోట్ ప్రకారమే, ఆయనను కాసేపు తన ఛాంబర్లో కూర్చోబెట్టామన్నారు. అయితే దాన్నీ తప్పు పట్టారని, ఆ విషయాన్ని కూడా బీఏసీలో చెప్పాలన్నారని, అది సరికాదని పేర్కొన్నారు.

ప్రశ్నోత్తరాలు అనేది సభ్యుల హక్కని, దాన్ని కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందని స్పీకర్ తమ్మినేని తెలిపారు. ఆ దిశలోనే ప్రతి రోజూ కృషి చేస్తున్నానన్నారు. మాట్లాడితే సీనియర్లం అంటారని, కానీ వారి ప్రవర్తన ఏ మాత్రం సరిగ్గా లేదన్నారు. వాయిదా తీర్మానం ప్రవేశపెట్టి, దాన్ని ఆమోదించాలని, చర్చకు అనుమతించాలని, అనుమతించకపోతే.. మా ఇష్టం వచ్చినట్లు దౌర్జన్యాలు చేస్తామని అనడం ఏ మాత్రం సరి కాదని టీడీపీ సభ్యుల్ని హితవు పలికారు.
ప్రతి రోజూ స్పీకర్ పోడియం చుట్టుముట్టడం, రెండువైపులా రావడం, దూషించడం, పేపర్లు చించేయడం, తన మీద వేయడం అలవాటుగా మారిందని తమ్మినేని తెలిపారు. ఇక వీరాంజనేయులు అయితే, ఏకంగా తన ఛైర్ను తోస్తున్నారన్నారు. ఇవాళ తన ముఖంపై ప్లకార్డు కూడా పెట్టారన్నారు. మరోవైపు అచ్చెన్నాయుడు, రామకృష్ణబాబు, పక్క నుంచి ఆ పని చేస్తున్నారన్నారు. అలా తన ముఖం మీద ప్లకార్డులు పెట్టడంతో సభ కూడా కనిపించడం లేదన్నారు. నేను అలా చేయొద్దంటే, చేయి చేసుకున్నట్లు అనుకోవాలా అని ప్రశ్నించారు. తాను నిజంగా అలా చేసి ఉంటే, వారం రోజుల నుంచి సహిస్తూ ఉంటానా? ఇన్ని రోజులు భరిస్తానా అని అడిగారు.

తాను ఏనాడూ టీడీపీ సభ్యులను అగౌరవపర్చలేదన్నారు. వారికీ మాట్లాడే అవకాశం ఇవ్వాలనుకున్నానన్నారు. కానీ వారు ఆ అవకాశాన్ని వినియోగించుకోలేదని, తనును రోజూ అగౌరవపర్చారని, అయినా ఇన్ని రోజులు భరించానన్నారు. కానీ ఇవాళ వారి ప్రవర్తన మితి మీరిందన్నారు. ప్లకార్డు తెచ్చి ఏకంగా తన ముఖం మీద పెట్టారన్నారు. అప్పుడు ఎలీజా మాట్లాడుతూ, తమ హక్కులు కాపాడాలని కోరుతూ, నన్ను రక్షించే ప్రయత్నం చేశారని, ఆయనను తోసేశారన్నారు. అదే సమయంలో తాను ఆయన్ను (బాల వీరాంజనేయులు) కొట్టానని ఆరోపించారు.
సభలో చర్చ జరగాలని తమ్మినేని కోరారు. ప్రజల సమస్యలపై మాట్లాడాలన్నారు. ఎంతో ఖర్చు పెట్టి సభ నిర్వహిస్తున్నామని, అందుకే విపక్షం కూడా ఈ అవకాశాన్ని వినియోగించాలన్నారు. టీడీపీ సభ్యులు రోజూ గొడవ చేస్తే, ఏరోజుకు ఆరోజు సస్పెండ్ చేస్తే, తనను కొందరు ప్రశ్నించారన్నారు. మొత్తం సెషన్ అంతా సస్పెండ్ చేయొచ్చు కదా అని? కావాలంటే తాను అలా చేయొచ్చని, కానీ తాను ఆ పని చేయనన్నారు. గత అసెంబ్లీలో రోజాపై ఏడాదిపాటు నిషేధం విధించారని, దాని వల్ల ఏం జరిగిందన్నారు. ప్రజలు అన్ని గుర్తించారు కాబట్టే, గత ఎన్నికల్లో టీడీపీకి తగిన బుద్ధి చెప్పారన్నారు. అందుకే తాను టీడీపీ సభ్యుల్ని మారాలని కోరుతున్నానన్నారు. అలాగే చంద్రబాబును కూడా సభకు రండి, ప్రజా సమస్యలు చర్చిద్దామని కోరారు.

సభలో మీరూ మాట్లాడొచ్చు. మీ అభిప్రాయాలు చెప్పొచ్చని, కానీ పోడియం వద్దకు రావడం, టిక్.. టిక్ అని శబ్ధాలు చేయడం, నా కోసం పెట్టిన పేపర్లు చించి, నాపై వేయడం మంచి పద్ధతి కాదని తమ్మినేని తెలిపారు. పోడియంను చుట్టుముట్టడమే కాకుండా, తనపై వ్యక్తిగతంగా దూషణలు చేయడం సరికాదన్నారు. ఎవరైనా సభ్యుడు వెల్లోకి రావడం, స్పీకర్పై వ్యాఖ్యలు వంటివి చేస్తే, ఆటోమేటిక్గా మూడు సెషన్లు లేదా హౌజ్ అనుకుంటే, మొత్తం సమయానికి సస్పెండ్ చేయాలి. ఆ హక్కు సభకు ఉంది. ఈ సభకు అలా ఎన్నో విశేషాధికారాలు ఉన్నాయని గుర్తుచేశారు. సభ్యులు ఎవరైనా సభాపతి పోడియం వద్దకు వచ్చి, అగౌరవ పర్చే విధంగా వ్యవహరిస్తే, ఆటోమేటిక్గా సస్పెండ్ అయినట్లు. ఆ రూలింగ్ను తాను తిరిగి అమల్లోకి తెస్తున్నానన్నారు. దీన్ని ఆమోదించాలని సభను కోరారు. అనంతరం సభ ఆమోదించింది.
-
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications