ఎపి భవన్లో దీక్ష: ఖాళీ చేయాలని చంద్రబాబుకు నోటీసు
న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ఢిల్లీలోని ఎపి భవన్ అధికారులు మంగళవారం నోటీసులు ఇచ్చారు. బాబు దీక్షకు ఎలాంటి అనుమతి లేదని చెబుతూ ఎపి భవన్ అధికారులు ఈ నోటీసులు ఇచ్చారు. బాబు దీక్షకు అనుమతి లేదని, నిబంధనల ప్రకారం మీడియా సమావేశానికి మాత్రమే అనుమతి ఉందని అధికారులు చెప్పారు.
ఈ నేపథ్యంలో దీక్ష చేస్తున్న బాబుకు వెంటనే ఎపి భవన్ ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేశారు. చంద్రబాబు ఆమరణ నిరాహార దీక్ష మంగళవారం రెండో రోజుకు చేరుకుంది.
కాగా, ఇరు ప్రాంతాలకు సమన్యాయం పేరుతో చంద్రబాబు నాయుడు ఢిల్లీలోని ఎపి భవన్లో సోమవారం ఆమరణ నిరాహార దీక్షకు దిగిన విషయం తెలిసిందే.
ఈ దీక్షపై ఎపి భవన్ అధికారులు నిన్ననే గందరగోళంలో పడ్డారు. కేబినెట్ హోదా కలిగిన బాబు విలేకరుల సమావేశం కోసం కాన్ఫరెన్స్ హాల్కు అనుమతి తీసుకున్నారు. విలేకరుల సమావేశం కాగానే బాబు నేరుగా అక్కడే ప్రాంగణంలో ఉన్న సిమెంట్ వేదిక పైన దీక్షకు కూర్చున్నారు. నిన్ననే అధికారులు దీక్షకు అనుమతి లేదని చెప్పారు. అయినా బాబు అందుకు నిరాకరించి దీక్షకు కూర్చున్నారు. దీంతో ఈ రోజు నోటీసులు ఇచ్చారు.