అసెంబ్లీ, సచివాలయం... విభజన: బాబు, కెసిఆర్లకు...
హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖలకు హైదరాబాదులో భవనాలను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శాసన సభ, సచివాలయం సహా అన్ని శాఖల ప్రధాన కార్యాలయాలు, కమిషనరేట్లను రెండు రాష్ట్రాలకు విభజించారు.
బిఆర్కే భవన్, ఎర్రమంజిల్లోని పంచాయతీరాజ్ శాఖ కార్యాలయం, విద్యుత్ సౌధ, జలసౌధ, పంచయతీరాజ్ కమిషనర్ కార్యాలయం, వ్యవసాయశాఖ కమిషనరేట్, మహిళా శిశు సంక్షేమ శాఖ భవనం, దామోదరం సంజీవయ్య సంక్షేమ భవనం, భూపరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయం.. తదితర అన్ని ప్రధాన భవనాల్లో రెండు రాష్ట్రాలకు కార్యాలయాలను కేటాయించారు.

చంద్రబాబు, కెసిఆర్లకు...
ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులు, సచివాలయం, శాసనసభ, శాసనమండలి వంటివి విభజిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. అందరికీ వసతి, సీట్లు కల్పిస్తూ నిర్ణయించారు. అలాగే వివిధ ప్రభుత్వ శాఖలకు సచివాలయంలో బ్లాకులు కేటాయిస్తూ కూడా ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారిక కార్యాలయానికి సచివాలయంలోని ఎల్-బ్లాక్లో ఎనిమిదవ అంతస్తును ఖరారు చేశారు. అలాగే క్యాంప్ కార్యాలయంగా లేక్వ్యూ అతిధి గృహాన్ని ఖరారు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు గత ముఖ్యమంత్రులు వినియోగించుకున్న సచివాలయంలోని సి-బ్లాక్నే అధికారిక కార్యాలయంగా ఖరారుచేయగా, బేంగపేటలోని భవనాన్నే క్యాంప్ కార్యాలయంగా ఉంచారు.

అసెంబ్లీలో...
ప్రస్తుత అసెంబ్లీ భవనాల్లోని కొత్త భవనాన్ని, అందులో ఉన్న మంత్రుల ఛాంబర్లు, కమిటీ హాళ్లను తెలంగాణ రాష్ట్రానికి కేటాయిస్తూ పాత అసెంబ్లీ భవనంలోని ఛాంబర్లు, కమిటీ హాళ్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించారు. ఇక ఆంధ్రప్రదేశ్ మండలి కోసం ప్రస్తుతం ఉన్న మండలి భవనాన్ని, తెలంగాణ మండలికోసం జూబ్లీ హాలును ఖరారుచేశారు.

మినిస్టర్స్ క్వార్టర్స్లో...
బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోనున్న మంత్రుల వసతి సముదాయంలోని తొలి పదిహేను భవనాలను తెలంగాణ మంత్రుల కోసం, 16 నుంచి 30వ నంబర్ వరకు ఉన్న భవనాలను ఆంధ్రప్రదేశ్ మంత్రుల కోసం కేటాయించారు. ఇదే విధంగా కొత్త, పాత ఎమ్మెల్యే క్వార్టర్స్ను కూడా ఇరు ప్రాంతాల ప్రజాప్రతినిధులకు కేటాయించారు.

సచివాలయంలో....
సచివాలయంలోని అన్ని బ్లాకులను ఇరు రాష్ట్రాలకు పంపకాలు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన ఎ-బ్లాక్లో అటవీశాఖ, ఐటి కమ్యూనికేషన్లు, న్యాయశాఖ, హోంశాఖ, రవాణా, రోడ్లు భవనాలశాఖలకు కార్యాలయాలుగా ఏర్పాటుచేశారు. బి-బ్లాక్లో సాధారణ పరిపాలనశాఖ (ఎన్నికలు), సాధారణ పరిపాలనశాఖ, యువజన, పర్యాటక, సాంస్కృతిక శాఖలు, నీటిపారుదలశాఖలకు కేటాయించారు.
సి-బ్లాక్లో తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంతోపాటు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలన, ముఖ్యమంత్రి కార్యదర్శులు, ముఖ్యమంత్రి సమావేశ మందిరాలకు కేటాయించారు. డి-బ్లాక్లో గిరిజన, సాంఘిక, వెనుకబడిన, స్ర్తి, శిశు, వికలాంగ సంక్షేమశాఖలు, పాఠశాల విద్య, ఉన్నత విద్య, వ్యవసాయం, ఆహారం, పౌర సరఫరాలు, పశుసంవర్ధకశాఖ, డెయిరీ డెవలప్మెంట్, పరిశ్రమలు, పెట్టుబడులు-మౌళికాభివృద్ధి, కార్మిక, ఉపాథి, ఇంధనశాఖ, ఐటి కమ్యూనికేషన్లు, గృహనిర్మాణం, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, వైద్య ఆరోగ్యం, ఆర్ధిక, రెవెన్యూ శాఖలకు కేటాయించారు.

సచివాలయంలో....
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎల్-బ్లాక్లో మున్సిపల్ పరిపాలన, గృహనిర్మాణం, ఇంధన, అటవీ, యువజన, పర్యాటకశాఖలు, వైద్య ఆరోగ్యం, మహిళా శిశు సంక్షేమం, ఐటి, కమ్యూనికేషన్లు, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్, పరిశ్రమలు, పెట్టుబడులు, కార్మిక, ప్రణాళిక, సాధారణ పరిపాలన శాఖలకు కేటాయించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మంత్రిమండలి సమావేశ మందిరం, ముఖ్యమంత్రి కార్యదర్శులకు ఇదే బ్లాక్లో వసతి సమకూర్చారు.
జె-బ్లాక్లో న్యాయశాఖ, సాధారణ పరిపాలన, పశుసంవర్ధకశాఖ, వ్యవసాయం, పౌర సరఫరాలు, ఉన్నత విద్య, పాఠశాల విద్య, సంక్షేమశాఖలు, హోంశాఖ, రవాణా, రోడ్లు భవనాలు, నీటిపారుదల, పంచాయితీరాజ్శాఖలకు కేటాయించగా, నార్త్ హెచ్ బ్లాక్లో సాధారణ పరిపాలన విభాగాలు, ఎపి టెక్నాలజీ, ఆర్ధికశాఖ, రెవెన్యూ, ఎపి సచివాలయ ఉద్యోగుల సంఘం ఏర్పాటుచేస్తున్నారు.
దక్షిణ హెచ్-బ్లాక్లో మంత్రులకు ఛాంబర్లు, లైబ్రరీ, కమిషనర్ ఆఫ్ ఎంక్వయిరీస్లను, కె-బ్లాక్లో న్యాయశాఖ, మంత్రులకు ఛాంబర్లు, ప్రధాన ఎన్నికల అధికారి, ఇతర కార్యాలయాలకు కేటాయించారు.












Click it and Unblock the Notifications