వైసీపీ నుంచి వచ్చే ఎంపీలకు పురందేశ్వరి కండిషన్-దానికి ఒప్పుకుంటే..?
ఏపీలో ప్రస్తుతం ఫిరాయింపుల పర్వం కొనసాగుతోంది. ఇవాళ ఇద్దరు వైసీపీ ఎంపీలు ఆ పార్టీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసేసారు. త్వరలో టీడీపీలో చేరబోతున్నట్లు సంకేతాలు కూడా ఇచ్చారు. మరికొందరు వైసీపీ ఎంపీలు కూటమిలోని టీడీపీ, బీజేపీ వంటి పార్టీల్లో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీనిపై స్పందించిన ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి
ఇలా తమ పార్టీలోకి వచ్చే వైసీపీ ఎంపీ, ఎమ్మెల్సీలకు క్లారిటీ ఇచ్చేశారు.
వైసీపీకి చెందిన ఇద్దరు రాజ్యసభ ఎంపీలు తమ పార్టీలోకి వస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై ఇవాళ విజయవాడలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి స్పందించారు. ఆ విషయంపై తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు. అయితే ఇలా వైసీపీ నుంచి తమ పార్టీలోకి వచ్చే వారికి మాత్రం ఓ కండిషన్ ఉంటుందన్నారు. పార్టీ సిద్ధాంతాలను ఆమోదించే వారికి మాత్రమే బీజేపీలోకి ప్రవేశం ఉంటుందని పురందేశ్వరి తెలిపారు. వాటికి అంగీకరిస్తేనే పార్టీలో చేర్చుకుంటామన్నారు.

వైసీపీ నుంచి వచ్చే రాజ్యసభ ఎంపీలతో పాటు , ఎమ్మెల్సీలకూ ఇదే సూత్రం వర్తిస్తుందని పురందేశ్వరి తేల్చేశారు. అలాగే ఎర్ర చందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డి బీజేపీలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ లభించిందన్న వార్తలపైనా స్పందించారు. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. వాస్తవానికి తమ పార్టీలో చేరే నేతలపై అన్ని స్దాయిల్లోనూ చర్చించాకే తుది నిర్ణయం తీసుకుంటామని పురందేశ్వరి వెల్లడించారు. దీంతో బీజేపీలో చేరే వారంతా ఇప్పుడు పురందేశ్వరి కండిషన్లకు ఒప్పుకోవాల్సిందే.












Click it and Unblock the Notifications