సాయిరెడ్డికి సోము షాకింగ్ కౌంటర్- బెయిల్ రద్దు- జైల్లో కూరకు క్యాబేజీ పూలంటూ
తిరుపతి ఉపఎన్నిక నేపథ్యంలో ఏపీలో రాజకీయ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఓవైపు తిరుపతిలో రికార్డు మెజారిటీతో గెలుస్తామని చెబుతున్న వైసీపీ.. తాజాగా ప్రత్యర్ధులను టార్గెట్ చేస్తూ చేస్తున్న విమర్శలు చర్చనీయాంశమవుతున్నాయి. తమకు ఇంతో ఇంతో పోటీ ఇచ్చే టీడీపీ కంటే బీజేపీని టార్గెట్ చేస్తూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్లు పెట్టడంతో ఏపీ బీజేపీ ఛీఫ్ సోము వీర్రాజు దానికి ఘాటుగా సమాధానం ఇచ్చారు.
ఏపీ బీజేపీని ఉద్దేశించి తాజాగా ట్వీట్ పెట్టిన వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి.. తిరుపతి ఉపఎన్నికలకు ముందు మీరు వేస్తున్న డ్రామాలకు జనం నవ్వుకుంటున్నారు. ఉప ఎన్నికల్లో డిపాజిట్లు వస్తే చాలు, మనవాడు సీఎం అయిపోతాడన్నట్లు నటిస్తున్నారంటూ ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన సోము వీర్రాజు.. ఇవాళ ఓ రేంజ్లో దానికి కౌంటర్ ఇచ్చారు. మా ఊసు ఎందుకులే విజయసాయిరెడ్డి గారూ.. కోర్టులకు చెవులో పూలు పెడుతూ బయట మేకపోతు గాంభీర్యంతో తిరుగుతున్నా లోపల గోళ్లు కొరుక్కుంటున్నారటగా అలీబాబా నలభై దొంగలంతా.. అంటూ ట్వీట్ చేశారు.
అక్కడితో ఆగకుండా సాయిరెడ్డికి సీబీఐ కోర్టు గతంలో ఇచ్చిన బెయిల్నూ ప్రస్తావించారు. తిరుపతి ప్రజలకు మేం ఇచ్చామో చెప్పి క్యాబేజీ పూలు మీకు పంపిస్తాం. బెయిల్ రద్దవగానే కూరకి లోపల ఉపయోగపడతాయంటూ సోము సంచలన ట్వీట్లో పేర్కొన్నారు. తద్వారా త్వరలో మీకు బెయిల్ రద్దయి జైలుకు వెళ్లబోతున్నారు. అప్పుడు మేం ఇచ్చిన క్యాబేజీ పూలను కూర వండుకోండి అన్నట్లుగా సోము ట్వీట్లో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.