పవన్ వ్యూహంతో బీజేపీలో అంతర్మథనం ? కాసేపట్లో కోర్ కమిటీ భేటీ !
ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు తర్వాత రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఈ అరెస్టును సమర్ధించుకునేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుండగా.. చంద్రబాబుకు మద్దతుగా మరోసారి పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. ఇదే క్రమంలో రాజమండ్రి జైలుకు వెళ్లి చంద్రబాబును పరామర్శించిన పవన్ కళ్యాణ్.. అనంతరం టీడీపీతో జనసేన పొత్తును ప్రకటించారు. ఈ ప్రకటన సహజంగానే జనసేనతో పొత్తులో ఉన్న బీజేపీకి షాకిచ్చింది.
పొత్తులో ఉంటూనే తమతో చర్చించకుండానే టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనతో షాక్ కు గురైన బీజేపీ నేతలు ఆ తర్వాత దీనిపై స్పందించారు. పొత్తుల వ్యవహారం అధిష్టానం చూసుకుటుందంటూ ఓ ప్రకటన చేసి అప్పటికప్పుడు ఈ వ్యవహారం నుంచి బయటపడేందుకు ప్రయత్నించారు. అయితే క్రమంగా టీడీపీ-జనసేన రెండూ క్షేత్రస్దాయిలో కలిసి పనిచేస్తుండటం, అదే సమయంలో జనసేనతో పొత్తు ఉందంటూ తాము ఎన్నిసార్లు ప్రకటనలు చేస్తున్నా ప్రయోజనం లేకపోవడంతో దీనిపై చర్చించేందుకు బీజేపీ కోర్ కమిటీ ఇవాళ మధ్యాహ్నం సమావేశమవుతోంది.

మధ్యాహ్నం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో భేటీ కానున్న కోర్ కమిటీ..పలు కీలక అంశాలపై చర్చించబోతోంది. ఈ భేటీకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరితో పాటు సీనియర్లు కిరణ్ కుమార్ రెడ్డి, సుజనా చౌదరి, సీఎం.రమేష్, సోము వీర్రాజు సహా పలువురు ముఖ్య నేతలు హాజరు అవుతున్నారు. పవన్ కల్యాణ్ టీడీపీతో పొత్తులపై చేస్తున్న వ్యాఖ్యలపై కోర్ కమిటీలో చర్చించనున్నారు. అలాగే ఏపీలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై కొర్ కమిటీలో చర్చిస్తారు.
ముఖ్యంగా పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు ప్రకటన తర్వాత ఏపీ బీజేపీలో నెలకొన్న పరిణామాలపై కోర్ కమిటీ చర్చించనుంది. అనంతరం ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాలను అధిష్టానానికి త్వరలో నివేదించనున్నారు. అనంతరం అధిష్టానం పవన్ కళ్యాణ్ తో చర్చించేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఇవాళ కోర్ కమిటీ భేటీలో తీసుకునే నిర్ణయాలపై ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications