ఏపీలో బీజేపీ పొత్తు వీరితోనే ! పార్టీ కార్యవర్గ భేటీలో క్లారిటీ- పవన్ కామెంట్స్ రాగానే..!
ఏపీలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుందనే అంశంపై ఇవాళ దాదాపు క్లారిటీ వచ్చేసింది. భీమవరంలో జరుగుతున్న పార్టీ కార్యవర్గ భేటీలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక ప్రకటన చేశారు.
భీమవరం : ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పొత్తుల వ్యవహారాలు కూడా తెరపైకి వచ్చేస్తున్నాయి. ఓవైపు బీజేపీతో మిత్రపక్షంగా ఉంటున్న పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబుతో నిర్వహిస్తున్న భేటీలతో కొత్త పొత్తులపై చర్చ సాగుతోంది. అదే సమయంలో పవన్ బీజేపీతో కలిసి ఉంటారా లేదా అన్న దానిపైనా చర్చ సాగుతోంది. ఈ క్రమంలో ఇవాళ భీమవరంలో జరుగుతున్న బీజేపీ కార్యవర్గ భేటీలో సోము వీర్రాజు కీలక ప్రకటన చేశారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు భీమవరంలో జరుగుతున్న పార్టీ కార్యవర్గ భేటీ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. బీజేపీ రాష్ట్రంలో చేపట్టే భవిష్యత్ ఉద్యమాలను ఆయన వివరించారు. త్వరలో ప్రజాపోరు 2 ప్రారంభం అవుతుందన్నారు. టీడీపీ, వైసీపీ కుటుంబ పార్టీలకు బీజేపీ దూరమని ఆయన ప్రకటించారు. అలాగే జనసేన తో కలిసే ఉన్నాం, కలిసే ఉంటామని కూడా వెల్లడించారు. చంద్రబాబు, జగన్ లు బీజేపీపై కుట్రలు మానుకోవాలన్నారు. బీజేపీని బలహీనపర్చేందుకు కుట్రలు చేసే వారికి రాజకీయ సమాధానం చెబుతామన్నారు.

మరోవైపు ఇవాళ తెలంగాణలోని కొండగట్టు వెళ్లిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి బీజేపీతో పొత్తు కొనసాగుతుందని, వారు కాదంటే కొత్త పొత్తులకు పోతామంటూ వ్యాఖ్యానించారు. తద్వారా బీజేపీ కాదంటేనే తాను ఇతర పొత్తులకు వెళ్తాననే సంకేతాలు ఇచ్చారు. దీంతో బీజేపీ నేతలు కూడా జనసేనతోనే తమ పొత్తు కొనసాగుతుందంటూ స్పష్టత ఇచ్చారు. దీంతో టీడీపీతో పొత్తు పెట్టుకుని బీజేపీకి పవన్ గుడ్ బై చెబుతారంటూ జరుగుతున్న ప్రచారానికి తాత్కాలికంగా ఫుల్ స్టాప్ పడినట్లయింది.












Click it and Unblock the Notifications