వీర్రాజు ను తప్పించాలి - ఢిల్లీ కేంద్రంగా పంచాయితీ : హైకమాండ్ సీరియస్..!!
సోము వీర్రాజుపైన ఏపీ బీజేపీ నేతలు పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేసారు. పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఏపీ బీజేపీలో అంతర్గత పోరు ఢిల్లీకి చేరింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపైన పార్టీ నేతలు ఢిల్లీలో కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మురళీధరన్తో సమావేశమయ్యారు. నాయకత్వాన్ని మార్చకపోయినా కనీసం పార్టీ తీరు మారాలని మురళీధరన్కు విజ్ఞప్తి చేశారు. బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు కన్నా టీడీపీలో చేరారు. ఇదే సమయంలో ఏపీ బీజేపీలో సోము వీర్రాజును వ్యతిరేకిస్తున్న నేతలంతా ఢిల్లీ వెళ్లారు. ఏపీలో పార్టీ పరిస్థితులను ఏకరువు పెట్టారు. పార్టీ ఎదిగే అవకాశం ఉన్నా పట్టించుకోవటం లేదని చెప్పుకొచ్చారు. కానీ, వాళ్లకు ఆశించిన స్థాయిలో స్పందన కనిపించ లేదు. అసలు అధ్యక్షుడిని మార్చాల్సిన అవసరం ఏంటని పార్టీ నేతలను మురళీధరన్ ప్రశ్నించారు.
ఏపీ లో సోము వ్యతిరేక వర్గం తమ కార్యాచరణ వేగవంతం చేసింది. పార్టీ నాయకత్వ బాధ్యతలు మార్చాలనే డిమాండ్ తో ఢిల్లీకి చేరింది. తొలుత వారంతా విజయవాడ కేంద్రంగా సమావేశం కావాలని భావించారు. కానీ, సమావేశాలు వద్దని..సమస్యలు ఉంటే పార్టీ నాయకత్వంతో చర్చించాలని వారికి పార్టీ ముఖ్య నేతలు సూచించారు. దీంతో..వారంతా ఢిల్లీలో పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ తో సమావేశమయ్యారు. అసలు ఢిల్లీకి రావాల్సిన పరిస్థితి ఏంటని ఆయన నుంచి పార్టీ నేతలకు ప్రశ్న ఎదురైంది. తాము సోముకు వ్యతిరేకం కాదని.. పార్టీ రాష్ట్రంలో సరైన విధానంలో వెళ్లటం లేదని వివరించారు. పరోక్షంగా సోము వీర్రాజుతో పాటుగా ఎంపీ జీవీఎల్.. సునీల్ థియోథర్ మీద ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. కన్నా పార్టీ వీడటం పైన ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

బీజేపీలోని కొందరు నేతలు తనతో టచ్ లో ఉన్నారంటూ చేసిన వ్యాక్యలు నేతలు ప్రస్తావించారు. అసలు అధ్యక్షుడి మార్పు దేనికని మురళీధరన్ ప్రశ్నించారు. అటువంటి అవసరం ఉంటే అధిష్టానం చూసుకుంటుందని స్పష్టం చేశారు. ఫిర్యాదుల కోసం ఢిల్లీ దాకా రావాల్సిన అవసరం లేదంటూ నేతలకు క్లాస్ తీసుకున్నారు. తాము కన్నాకు మద్దతుగా సోముపైన ఫిర్యాదు చేస్తున్నట్లు పేర్కొనటం సరి కాదన్నారు. ఏపీలో పార్టీ పరిస్థితుల పైన తాను ఇక నెలలో రెండు రోజుల సమయం కేటాయిస్తానని చెప్పారు. త్వరలోనే తాను ఏపీ పర్యటనకు వస్తున్నానని..అక్కడ సమావేశం అవుదామని పేర్కొన్నారు. ఏపీలో పర్యటన సమయంలో స్థానికంగా ఎటువంటి సమస్యలు ఉన్నా చర్చించుకుని పరిష్కరించుకుందామని తెలిపారు. పార్టీలో పరిస్థితి పైన అధినాయకత్వానికి తాను నివేదిక ఇస్తానని మురళీధరన్ హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications