అమరావతి ఉధ్యమంలోకి బీజేపీ-21న పాదయాత్రలోకి ఎంట్రీ-రంగంలోకి అగ్రనేతలు
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ప్రకటించిన మూడు రాజధానుల ప్రక్రియకు వ్యతిరేకంగా సాగుతున్న అమరావతి రైతుల ఉద్యమంలోకి ఎంట్రీ ఇవ్వాలని బీజేపీ నిర్ణయించింది. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తిరుపతి పర్యటన సందర్భఁగా రైతుల ఉద్యమంలో ఎందుకు పాల్గొనడం లేదని బీజేపీ నేతల్ని ప్రశ్నించారు. దీంతో త్వరలో ఉద్యమంలోకి నేరుగా దిగాలని బీజేపీ నేతలు నిర్ణయం తీసుకున్నారు.
అమరావతి నుంచి రాజధాని తరలింపు ప్రయత్నాలకు నిరసనగా రైతులు న్యాయస్ధానం టూ దేవస్ధానం పాదయాత్ర చేపట్టారు. ఇందులో ఇప్పటికే టీడీపీ, సీపీఐ నేతలు పాల్గొంటున్నారు. మహిళలు దేవస్దానానికి పాదయాత్ర చేస్తుంటే మీరు ఎందుకు దూరంగా ఉంటున్నారని అమిత్ షా ప్రశ్నించారు. దీంతో ఈ నెల 21న రైతుల పాదయాత్ర వద్దకు వెళ్లి సంఘీభావం ప్రకటించాలని బీజేపీ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర బీజేపీలోని అగ్రనేతలు పాదయాత్రకు సంఘీభావం ప్రకటించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

అమరావతి రాజధాని ప్రాంత రైతులు నిర్వహిస్తున్న "మహా పాదయాత్ర" లో ఈనెల 21వ తేదీన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నాయకత్వంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి, ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, జాతీయ కార్యదర్శి సత్య కుమార్,జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ, తదితర పార్టీ ముఖ్య నేతలు, జిల్లా పార్టీ అధ్యక్షులు పాల్గొంటారని బీజేపీ ఇవాళ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. భవిష్యత్తులో అమరావతి రాజధాని ఎన్నికల అంశంగా మారే అవకాశం ఉందన్న అంచనాతో బీజేపీ సహా ఇతర విపక్షాలు కూడా ఈ ఉద్యమంవైపు మళ్లుతున్నారన్న అంచనాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ తీసుకున్న నిర్ణయం కచ్చితంగా ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్రకు ఇప్పటికే అన్ని విపక్షాలు మద్దతు ప్రకటించాయి. అయితే బీజేపీ వ్యవహారాల సహ ఇన్ ఛార్జ్ సునీల్ దియోధర్ అది టీడీపీ మద్దతున్న ఉద్యమమని, దీనికి దూరంగా ఉండాలని సూచించినట్లు వార్తలొచ్చాయి. దీంతో బీజేపీ నేతలు పాదయాత్రకు దూరంగా ఉండిపోయినట్లు తెలుస్తోంది. ఇప్పుడు అమిత్ షా సూచనతో వారంతా తిరిగి అమరావతి ఉద్యమంలో పాల్గొనేందుకు సిద్దమవుతున్నారు.












Click it and Unblock the Notifications