కుల రాజకీయాలకు కేంద్రబిందువుగా ఒంగోలు ఘటన: సుబ్బారావు గుప్తాపై దాడిని తప్పుపట్టిన బీజేపీ
అమరావతి: ప్రకాశం జిల్లాకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, వైశ్య సామాజిక వర్గానికి చెందిన సుబ్బారావు గుప్తాపై సొంత పార్టీకి చెందిన నాయకులు దాడికి పాల్పడిన ఘటనపై ఏర్పడిన రాజకీయ దుమారం కొనసాగుతోంది. తెలుగుదేశం పార్టీ నాయకులు దీన్ని తప్పు పట్టారు. వైసీపీ నేతల దౌర్జన్యానికి అడ్డు అదుపు లేకుండా పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు సుమోటోగా దీన్ని స్వీకరించారు. సుబ్బారావు భార్యను పోలీస్ స్టేషన్కు పిలిపించి.. పూర్తి వివరాలను సేకరించారు.

టీడీపీ సహా..
ఒంగోలులోని ఓ లాడ్జీలో సుబ్బారావు గుప్తాపై సొంత పార్టీకే చెందిన నాయకులు, మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి అనుచరులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. దీనిపై సోషల్ మీడియాలో పోస్ట్ అయిన వీడియో వైరల్గా మారింది. ఈ వీడియోను చూసిన తరువాత పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. ఈ ఘటన పట్ల తెలుగుదేశం పార్టీ తీవ్రంగా స్పందించింది. సొంత పార్టీ నాయకులపైనే వైసీపీ మంత్రులు దాడులు చేయిస్తున్నారంటూ మండిపడింది. సామాన్యుల పరిస్థితేమిటంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

ముఖ్యమంత్రి స్పందించాలంటూ..
తాజాగా- భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ నాయకులు ఈ ఘటన పట్ల స్పందించారు. వైశ్య సామాజికవర్గానికి చెందిన నాయకులపై దాడులకు పాల్పడటం వైసీపీ వైఖరికి అద్దం పడుతోందని ధ్వజమెత్తారు. దాడులు చేయడాన్ని వైసీపీ నాయకులు తమ జన్మహక్కుగా భావిస్తున్నారని సోము వీర్రాజు విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఘటనపై తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. సుబ్బారావుపై దాడికి పాల్పడిన వ్యక్తులతో బహిరంగ క్షమాపణలు చెప్పించాలని అన్నారు.

ఓటుబ్యాంకు రాజకీయాలు..
పార్టీకి సేవ చేసి, ఓట్లేసి గెలిపించుకున్న పాపానికి సొంత పార్టీ నాయకులపైనే దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావు బహిరంగ ప్రకటన విడుదల చేశారు. దాడి చేసిన వ్యక్తి సుభాని అనే ముస్లిం సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడం వల్ల అతనిపై చర్యలు తీసుకోవడానికి జగన్ సర్కార్ వెనుకాడుతోందని విమర్శించారు. తమ ఓటుబ్యాంకు ఎక్కడ దెబ్బతింటుందోనని ఆందోళన చెందుతోందని ఎద్దేవా చేశారు.

పిచ్చోళ్లమనుకుంటున్నారా?
వైశ్య సామాజిక వర్గాన్ని వైసీపీ కేవలం ఓటుబ్యాంకుగా పరిగణిస్తోందని ధ్వజమెత్తారు. ముస్లిం రాజకీయాలకు ఇది పరాకాష్ఠగా మారిందని ఆరోపించారు. ప్రభుత్వం, పార్టీపై విమర్శలు చేసిన వారిపై ఇలా సొంత పార్టీ నాయకులతోనే దౌర్జన్యాలు, దాడులకు పాల్పడటం వైసీపీ సంస్కృతికి అద్దం పడుతోందని జీవీఎల్ అన్నారు. దళిత, వైశ్య, బ్రాహ్మణ, వెనుకబడిన వర్గాల వారిని పిచ్చివాళ్లుగా చిత్రీకరించడం వైసీపీ నేతలకు అలవాటుగా మారిందని అన్నారు. ఈ దాడికి పాల్పడిన సుభాని, అతని అనుచరులను వెంటనే అరెస్ట్ చేయాలని జీవీఎల్ నరసింహా రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

మంత్రి బాలినేని జోక్యంతో..
ఈ వివాదాన్ని పరిష్కరించడానికి మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి రంగంలోకి దిగారు. సుబ్బారావు గుప్తాను కలుసుకున్నారు. విజయవాడలో మంత్రి బాలినేనిని కలిసి జరిగిన సంఘటనను ఆయనకు వివరించారు. మంత్రి జోక్యం చేసుకోవడంతో సుబ్బారావు గుప్తా మెట్టుదిగారని చెబుతున్నారు. బాలినేని శ్రీనివాస రెడ్డికి, పార్టీకి తాను విధేయుడునేనని స్పష్టం చేశారు. పార్టీలో చోటు చేసుకుంటోన్న పరిణామాలను తాను మంత్రి దృష్టికి తీసుకెళ్లానని ఆయన చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications