ఏపీ బీజేపీలో టీడీపీ కోవర్టులు ? - అధిష్టానం నిర్ణయాలకే ధిక్కారం.. అడుగడుగునా అడ్డు...
గతేడాది సార్వత్రిక ఎన్నికల్లో ఘోరపరాజయం తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కాస్తో కూస్తో ప్రభావం చూపాలని బీజేపీ అధిష్టానం తపన పడుతున్న తరుణంలో సొంత పార్టీ నేతలే వారికి వరుసగా షాకులిస్తున్నారు. కీలక అంశాలపై అధిష్టానం వైఖరి తెలుసుకోకుండా టీడీపీతో కలిసి ముందుకు సాగుతున్న తీరు విస్మయకరంగా ఉంది. రాష్ట్రంలో వైసీపీ సర్కారుతో ఉన్న సంబంధాలను దృష్టిలో ఉంచుకుని వ్యూహాత్మకంగా ముందుకు సాగాలని భావిస్తున్న బీజేపీ అధిష్టానానికి ఇది తలనొప్పిగా మారుతోంది. చాలా సందర్భాల్లో రాష్ట్ర నేతలు అధిష్టానాన్ని తప్పుదోవ పట్టిస్తున్నట్లు వారి వ్యాఖ్యలను బట్టి అర్ధమవుతోంది.
స్పీకర్ తమ్మినేనిపై హైకోర్టులో బీజేపీ పిటిషన్- వివాదాస్పద వ్యాఖ్యలపై చర్యలు కోరుతూ..
బీజేపీలో లుకలుకలు..
గతేడాది సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏపీలో మారిన పరిస్దితుల్లో కుదురుకునేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలకు సొంత పార్టీ నేతల నుంచే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా కొన్నేళ్లుగా టీడీపీ నేతలతో సత్సంబంధాలు నెరుపుతూ వస్తున్న బీజేపీ నేతలు ఇప్పుడు వారిని కాదని బీజేపీ అధిష్టానం మాట వినేందుకు సిద్ధంగా లేకపోవడంతో కీలక అంశాల్లో అధిష్టానంతో విభేదాలు తప్పడం లేదు. తాజాగా అమరావతి విషయంలోనూ అధిష్టానం పెద్దలు ఓ అభిప్రాయం చెబుతుంటే రాష్ట్ర బీజేపీ నేతలు పదేపదే దాన్ని ధిక్కరించడం వెనుక కారణాలు క్షేత్రస్ధాయిలో కనీస రాజకీయ పరిజ్ఞానం ఉన్న అందరికీ అర్ధమవుతూనే ఉన్నాయి.
టీడీపీ మాటే బీజేపీ బాట...
గతేడాది వైసీపీ చేతిలో ఘోరపరాజయం ఎదురైన తర్వాత రాష్ట్రంలో నానాటికీ పతనమవుతున్న టీడీపీ.. బీజేపీ అండతో ఆ లోటును భర్తీ చేసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. టీడీపీకి చెందిన నలుగురు ఎంపీలు బీజేపీలో చేరిపోవడం, ఆ తర్వాత కూడా టీడీపీ వాదననే బీజేపీ పలుమార్లు వినిపిస్తుండటం చూస్తుంటే ఇరుపార్టీల మధ్య అవగాహన అర్ధమవుతుంది. రాజ్యసభలో సంఖ్యాబలం లేకపోవడం వల్లే టీడీపీ ఎంపీలను పార్టీలో చేర్చుకున్నే బీజేపీ అధిష్టానం ఏపీ విషయంలో మాత్రం తమ పార్టీ ఎదగాలని మాత్రమే కోరుకుంటోంది. టీడీపీ ప్రాధాన్యం కోల్పోతున్న నేపథ్యంలో ఆ స్ధానాన్ని భర్తీ చేసేందుకు వేగంగా ప్రయత్నాలు చేస్తోంది. అయితే రాష్ట్రంలో బీజేపీ నేతలు మాత్రం టీడీపీ అజెండాను మోస్తూ అధిష్టానానికి చికాకు తెప్పిస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా ఓ నేతను సస్పెండ్ చేయడమే కాకుండా మరో ఇద్దరికి షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చారు.
కీలకాంశాలపై తలోమాట...
రాజధాని అమరావతితో పాటు పలు కీలక అంశాల్లో అధిష్టానం అభిప్రాయం ఒకలా ఉంటే రాష్ట్ర నేతల అభిప్రాయాలు మరోలా ఉంటున్నాయి. రాష్ట్ర రాజధాని ఎంపిక రాష్ట్ర ప్రభుత్వ అంశమని అధిష్టానం పదేపదే చెబుతున్నా రాష్ట్ర నేతలు మాత్రం టీడీపీతో కలిసి రాజధాని ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. రాజధానిపై వైసీపీ నిర్ణయాలను తప్పుబడుతున్నారు. తాజాగా రాజధానిపై ప్రభుత్వ నిర్ణయాలను రాష్ట్ర నేతలు తప్పుబట్టగా... పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ సునీల్ దియోధర్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. అంతకు ముందు రాజ్యసభ ఎంపీ, దక్షిణాది వ్యవహారాల ఇన్ ఛార్జ్ జీవీఎల్ నరసింహారావు కూడా ఇదే విషయం స్పష్టం చేశారు. అయినా రాష్ట్ర నేతల హంగామా ఆగడం లేదు.
Recommended Video
అధిష్టానానికి తప్పుడు సమాచారం...
రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పలు పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలపై సైతం అధిష్టానానికి రాష్ట్ర బీజేపీ నేతలు తప్పుడు సమాచారం పంపుతున్నారనే వాదన ఉంది. తాజాగా కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ వైసీపీ సర్కారు గురించి చేసిన సీరియస్ వ్యాఖ్యల వెనుక కూడా ఇదే కారణమని తెలుస్తోంది. రాజధానితో పాటు పలు కీలక అంశాలపైనా రాష్ట్ర బీజేపీ నేతల వైఖరి ఇదే విధంగా ఉంటోంది. దీనికి కారణం విపక్ష టీడీపీతో ఉన్న సంబంధాలే కారణమని అర్ధమవుతోంది. ఇదే అదనుగా టీడీపీ కూడా తాను చెప్పదల్చుకున్న విషయాలను బీజేపీ ద్వారా చెప్పిస్తున్నట్లు తెలుస్తోంది. అంతిమంగా ఇది బీజేపీ అధిష్టానం వైఖరికి విరుద్ధంగా ఉంటోంది.