AP Cabinet : పీఆర్సీకి ఆమోదం-రిటైర్మెంట్ పెంపు-భూకేటాయింపులు-నిర్ణయాలివే
ఇవాళ అమరావతిలోని సచివాలయంలో సమావేశమైన ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో ఉద్యోగులకు సంబంధించిన పలు కీలక నిర్ణయాలు ఉన్నాయి. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన జీవోల ప్రకారం పీఆర్సీని ఆమోదిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపుకు ఆమోదం లభించింది. దీంతో పాటు కేబినెట్ లో మరికొన్ని ప్రాధాన్యత కల నిర్ణయాలు తీసుకున్నారు.
పీఆర్సీకి కేబినెట్ ఆమోదం
ఏపీలో ప్రభుత్వం తాజాగా ఆమోదించిన ఉద్యోగుల పీఆర్సీని కేబినెట్ ఇవాళ ఆమోద ముద్ర వేసింది. ఉద్యోగుల ఆందోళనల నేపథ్యంలో పీఆర్సీపై చర్చించిన కేబినెట్.. ఆమోద ముద్ర వేస్తూ నిర్ణయం తీసుకుంది. పీఆర్సీ ఫిట్ మెంట్ శాతాన్ని 23 శాతానికి ఖరారు చేసిన ప్రభుత్వం.. హెచ్ఆర్ఏ, సీసీఏ వంటి భత్యాల తగ్గింపుతో దాన్ని బ్యాలెస్స్ చేసేసిందన్న విమర్శల నేపథ్యంలో పీఆర్సీపై చర్చించి పునరాలోచన చేస్తుందని భావించినా అలాంటిదేమీ జరగలేదు.
ఉద్యోగులపై మరిన్ని నిర్ణయాలు
పీఆర్సీతో పాటు ఉద్యోగులకు సంబంధించి మరికొన్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును 62 ఏళ్లకు పెంచుతూ కేబినెట్ మరో నిర్ణయం ఆమోదించింది. కోవిడ్ కారణంగా చనిపోయిన ప్రభుత్వ ఉద్యోగులకు జూన్ లోగా కారుణ్య నియామకాలు చేపట్టేందుకు కేబినేట్ ఆమోదం. తెలిపింది. అలాగే జగనన్న టౌన్ షిప్ లో ప్రభుత్వ ఉద్యోగులకు 10శాతం , పెన్షనర్స్ కోసం 5 శాతం రిజర్వ్ చేయడంతో పాటు 20శాతం రిబేట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.
ఉద్యోగులకు నచ్చచెప్తామన్న పేర్ని
పీఆర్సీతో పాటు ఇతర ఉద్యోగ సంఘాల సమస్యలపై సీఎస్ వాళ్లతో మాట్లాడతారని మంత్రి పేర్నినాని కేబినెట్ అనంతరం తెలిపారు. ఉద్యోగ సంఘాల నేతలతో సీఎస్ చర్చించబోతున్నారన్నారు. సీఎస్ ,సజ్జల ,ముగ్గురు మంత్రులు సంప్రదింపుల కమిటీ వేశారని మీడియాలొనే చూశానని పేర్ని తెలిపారు. సంప్రదింపులు చేయడం ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు మాటలు వినడం.. గాడిద ఎక్కడం ఒకటేనన్నారు. ఉపాద్యాయులను ఎన్నిరకాలుగా చంద్రబాబు ఇబ్బంది పెట్టారో మర్చిపోయారా అని పేర్ని ప్రశ్నించారు. ఉద్యోగులు చంద్రబాబు ముసలికన్నీరు చూసి మోసపోవద్దని పేర్ని కోరారు. ముఖ్యమంత్రి గురించి అసభ్యంగా మాట్లాడడం వల్ల పిఆర్సీ వస్తోందా అని ఆయన ఉద్యోగుల్ని ప్రశ్నించారు. చదువులు చెప్పే టీచర్లు ఇలా అసభ్యకరంగా మాట్లాడం సరైందేనా అని నిలదీశారు. ఎవరికైనా ఇబ్బందులు ఉంటాయని, అలా అని ఇలా మాట్లాడం మంచిది కాదన్నారు.
కేబినెట్ ఇతర నిర్ణయాలు
ఓబీసి నేస్తం ద్వారా ఇవ్వాల్సిన 589 కోట్ల విడుదలకు క్యాబినేట్ ఇవాళ ఆమోదం తెలిపింది. 3లక్షల 92 వేల అగ్రవర్ణ పేదలకు ఒక్కొక్కరికి 15వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని 7 మెడికల్ కాలేజ్ ల నిర్మాణానికి రూ.7800 కోట్ల విడుదలకు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. కృష్ణపట్నం ధర్మల్ ప్లాంట్ ను 25 ఏళ్ల పాటు సమర్ధవంతమైన సంస్థకు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. విశాఖలో ఆదానీ డేటా సెంటర్ కు భూమిని కేటాయిస్తూ కేబినెట్ మరో నిర్ణయం తీసుకుంది. అలాగే బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్ కు బాడ్మింటన్ అకాడమీ ఏర్పాటుకు తిరుపతిలో 5 ఎకరాల భూమి కేటాయింపు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకంలో స్వల్ప మార్పులు చేశారు. రెండు వాయిదాలలో డబ్బులు చెల్లించడానికి వెసులుబాటు కల్పిస్తూ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ధాన్యం కొనుగోలు కు సంబంధించి పౌరసరఫరాల కార్పొరేషన్ కు 2వేల కోట్లు రుణం తీసుకోవడానికి ప్రభుత్వం బ్యాంకు గ్యారెంటీ ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.