రిజర్వేషన్ల "పంచాయితీ"..: ప్రభుత్వ తాజా నిర్ణయంతో వివాదం: ఎన్నికలు జరగవా..!
ఏపీ ప్రభుత్వం జనవరి లో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. దీనికి అనుగుణంగా తాజా మంత్రివర్గ సమావేశంలో స్థానిక ఎన్నికల రిజర్వేషన్లను ఖరారు చేసింది. అయితే, ఇప్పుడు అదే తాజా వివాదానికి కారణమవుతోంది. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50 శాతం దాటటానికి వీలు లేదు. కానీ, ప్రభుత్వం 59.85 శాతం రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. పాత విధానంలో ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేసింది. గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం మార్చి నెలాఖరులోగా స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని కోర్టుకు చెప్పుకొచ్చింది. ఇప్పుడు తాజా రిజర్వేషన్ల నిర్ణయం పైన కోర్టు నిర్ణయం కీలకం కానుంది. దీంతో..ప్రభుత్వం చెబుతున్నట్లుగా జనవరి - ఫిబ్రవరి లో స్థానిక ఎన్నికలు జరుగుతాయా..వాయిదా పడతాయా..జరిగిన జడ్పీటీసీ..ఎంపీటిసీలకే జరుగుతాయా అనేది ఇప్పుడు అధికార వర్గాలతో పాటుగా రాజకీయ పార్టీల్లోనూ చర్చకు కారణమైంది.

ఏపీ ప్రభుత్వ తాజా నిర్ణయం..
తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో ఏపీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లను ఖరారు చేసింది. అందులో 59.85 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. అయితే, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50 శాతం దాటటానికి వీలు లేదు. ఆ విధంగా 50 శాతానికి రిజర్వేషన్లు పరిమితం చేయాలంటే రాజ్యంగం ప్రకారం ఎస్సీ..ఎస్టీ రిజర్వేషన్లు తగ్గించటానికి వీలు లేదు. ఇక, బీసీ రిజర్వేషన్ల పైన కోత విధించేందుకు ఏపీ ప్రభుత్వం సుముఖంగా లేదు. దీంతో.. బీసీలకు 34 శాతం.. ఎస్సీలకు..19.08 శాతం..ఎస్టీలకు 6.77 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించింది. ఇప్పుడు ఇదే న్యాయపర సమస్యగా మారుతోంది. దీని పైన కోర్టు నుండి అభ్యంతరాలు వ్యక్తం అయితే..ఏ రకంగా అధిగమించాలనే దాని పైన అధికారులు తర్జన భర్జన పడుతున్నారు.

కోర్టు సూచనల ఆధారంగా..
హైకోర్టుకు ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు జనవరి నుండి మార్చి 30 లోగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో జనవరి 3న ఎన్నికల షెడ్యూల్ కూడా సమర్పించాల్సి ఉంది. అయితే, రిజర్వేషన్లను 50 శాతానికి కుదించాలని కనుక హైకోర్టు ఆదేశిస్తే.. ప్రభుత్వం ఏం చేస్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది. కోర్టు రిజర్వేషన్ల పైన అభ్యంతరం వ్యక్తం చేస్తే స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. దాదాపు ఆరు నెలల వరకు తిరిగి ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు. లేదు. ప్రతి ఏటా జనవరిలో కొత్త ఓటరు జాబితా సిద్ధమవుతుంది. 18 ఏళ్లు నిండిన యువత పేర్లతో కొత్త ఓటర్ల జాబితా విడుదల చేస్తారు. దీంతో ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్లు విడుదల చేసేటట్లయితే కొత్త ఓటర్ల జాబితా ఆధారంగా ఎన్నికలు నిర్వహించాలన్న నిబంధనలున్నాయి. అయితే, కొత్త ఓటరు జాబితాను స్థానికసంస్థల ఓటరు జాబితాకు అనుగుణంగా మార్పు చేయాల్సి ఉంటుంది.

జరిగితే..ఆ రెండింటికి మాత్రమే..
ప్రభుత్వం మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని గట్టిగా చెబుతోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి సైతం మంత్రులకు ఆ దిశగా కార్యాచరణ నిర్దేశించారు. తాజాగా ఖరారు చేసిన రిజర్వేషన్ల కారణంగా అడ్డంకులు ఏర్పడకుంటే.. ముందుగా దీంతో ఎన్నికలు జరిగితే ముందుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు అనుగుణంగా ప్రభుత్వం మార్గం సుగమం చేసుకుంటోందనే చర్చ సాగుతోంది. ఇదే సమయంలో.. ఎన్నికల కమిషన్ కూడా జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు సంబంధించి ఓటర్ల జాబితా, ఎన్నికల ప్రక్రియ కోసం ప్రభుత్వానికి లేఖలు రాసింది. దీంతో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కావటంతో..జడ్పీటీసీ..ఎంపీటీసీ ఎన్నికలు తొలుత జరిగే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications