శుభవార్త, నిరుద్యోగ భృతి ఎంత, ఎవరికి అంటే?: కేబినెట్ కీలక నిర్ణయాలు
Recommended Video
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువతకు శుభవార్త. ఎన్నికలకు మరో ఏడాది కూడా లేదు. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఏపీ కేబినెట్ గురువారం ఆమోదం తెలిపింది. కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ భేటీ అనంతరం మంత్రి నారా లోకేష్ మీడియాకు వివరాలు తెలిపారు.
ముఖ్యమంత్రి యువనేస్తం పేరుతో నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. ప్రతి నెల బ్యాంకు అకౌంట్లలో డబ్బులు పడతాయని చెప్పారు. నిరుద్యోగ భృతి రూ.1000 ఇస్తున్నట్లు తెలిపారు. ప్రజాసాధికార సర్వే ప్రకారం రాష్ట్రంలో దాదాపు 12 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని, ఇందుకోసం నెలకు రూ.640 కోట్లు ఖర్చవుతాయని చెప్పారు.
కుటుంబంలో ఒక్క వ్యక్తికే పింఛన్ ఇస్తున్నామని నిరుద్యోగ భృతిని మాత్రం కుటుంబంలో ఎంతమంది నిరుద్యోగులుంటే అంతమందికీ ప్రతినెలా ఇస్తామన్నారు. యువతీ, యువకుల ఆన్లైన్పై పూర్తి అవగాహన ఉంటుందని కాబట్టి నమోదు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లో నిర్వహిస్తామన్నారు. ఆధార్ సంఖ్యను అనుసంధానం చేస్తామన్నారు. నమోదు ప్రక్రియ ముగిసిన 15 రోజుల తర్వాత బ్యాంకు ఖాతాల్లో భృతి జమ అవుతుందన్నారు.
22 ఏళ్ల నుంచి 35 ఏళ్ల లోపు వారికి నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. ఆగస్ట్ మూడు లేదా నాలుగో వారంలో నిరుద్యోగ భృతి రిజిస్ట్రేషన్ ప్రారంభిస్తామని చెప్పారు. నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తామన్నారు. దేశంలో నిరుద్యోగ భృతి ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే అన్నారు. లోకేష్ ఇంకా మాట్లాడుతూ.. రాష్ట్రానికి పెట్టుబడులు బాగా వస్తున్నాయని చెప్పారు. నవ్యాంధ్ర ప్రదేశ్కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ఓ బ్రాండ్ అంబాసిడర్ అన్నారు.
కేబినెట్ ఆమోదం తెలిపిన మరికొన్ని...
20వేల ఉద్యోగాల ఖాళీలు, 9,000 ఉపాధ్యాయ పోస్టులతో పాటు ఇతరత్రా శాఖల్లో ఉన్న ఖాళీలు భర్తీ చేయాలని తీర్మానం చేశారు. వుడాకు విశాఖ మెడ్టెక్ జోన్ చెల్లించే రూ.11 కోట్ల పన్ను మినహాయింపునకు ఆమోదం తెలిపింది. వుడాను విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీగా పేరు మార్చారు. ప్రస్తుతం ఉన్న వుడా పరిధి 5,573 చదరపు కి.మీ.ను 6,764.59 చ.కి.మీ. మేరకు పెంచారు.
వీఎంఆర్డీ పరిధిలోకి 48 మండలాలు, 1,346 గ్రామాలు రానున్నాయి. ఫిజియో థెరపిస్టుల రాష్ట్ర కౌన్సిల్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. చిత్తూరు జిల్లా కుప్పంలో ఎయిర్ స్ట్రిప్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. నూతన చేనేత విధానానికి ఆమోదించింది. కేబినెట్ భేటీ దాదాపు నాలుగు గంటల పాటు సాగింది. ఈ నెల 20వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉండే అవకాశముంది.