AP Cabinet: కీలక నిర్ణయాలివే..వారికి బంపర్ ఆఫర్: వైఎస్సార్ జయంతి నాడు భారీగా..!
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. ప్రత్యేకించి- దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి నాడు నిర్వహించాల్సిన రైతు దినోత్సవంపై చర్చ సాగింది. రైతు దినోత్సవాన్ని విజయవంతం చేయడానికి చేపట్టాల్సిన చర్యల గురించి చర్చించింది. కొత్త ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విధానం, పట్టణ ప్రాంతాల్లో జగనన్న టౌన్షిప్ కార్యక్రమం వంటి అంశాలు చర్చకు వచ్చాయి. రైతుల కోసం ఇ-సేల్స్ కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
భారీ ఎత్తున రైతు దినోత్సవం..
జగనన్న ఇళ్ల నిర్మాణం పథకం కింద చేపట్టిన గృహాలకు జులై 1, 3, 4 తేదీల్లో శంకుస్థాపనలు చేయాలని తీర్మానించింది. రాష్ట్రంలో 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం విద్యార్థులకు ల్యాప్టాప్ల పంపిణీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనిపై ఓ తీర్మానం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ వెటర్నరీ అంబులెన్స్లను కూడా కొనుగోలుకు మంత్రివర్గం అంగీకారం తెలియజేసింది. టిడ్కో ద్వారా 2,62,216 ఇళ్లను నిర్మించడానికి మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. మౌలిక సదుపాయాల కల్పనకు రూ.5,990 కోట్ల మేర బ్యాంకుల నుంచి రుణం తీసుకోవాలని నిర్ణయించింది.
ఒంగోలులో వర్శిటీ..
ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు పేరు మీద ఒంగోలు శివారులో ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే- విజయనగరంలో ఉన్న జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వ విద్యాలయం ఇంజినీరింగ్ కళాశాలకు యూనివర్శిటీ హోదా ఇవ్వడానికీ అంగీకారం తెలిపింది కేబినెట్. దీనికోసం జేఎన్టీయూ చట్టం 2008లో సవరణలను చేయాలని నిర్ణయించింది. సవరణలో కూడిన బిల్లును వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశాలు లేకపోలేదు. భూముల రీ సర్వేలో పట్టాదారులకు ధ్రువపత్రాల జారీ చేయడంతో పాటు ఏపీ భూహక్కు చట్ట సవరణకూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
హెటెరో డ్రగ్ సెజ్ ఏర్పాటు..
విశాఖ నక్కపల్లి దగ్గర హెటిరో డ్రగ్స్ సెజ్కు భూ కేటాయింపునకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. దీనికోసం 81 ఎకరాలను కేటాయించాల్సి ఉంటుందని తెలిపింది. 2021-24 ఐటీ విధానాన్ని ఆమోదించింది. కాకినాడ పోర్టులో రీగ్యాసిఫికేషన్ టెర్మినల్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ఏపీ మంత్రివర్గం. మ్యారిటైమ్ బోర్డుతో సంయుక్త కార్యకలాపాలను చేపట్టడానికీ ఓకే చెప్పింది. అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో నెలకొన్న నీటి ఎద్దడిని నివారించడానికి రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్ట్ కింద నీళ్లను అందించాలని నిర్ణయించింది.
ఏజెన్సీ గ్రామాల కోసం..
అలాగే- తొలిదశ ఎత్తిపోతలు, గ్రావిటీ ద్వారా నీటి సరఫరాకు అంగీకారం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు 539 కొత్త 104 అంబులెన్స్ను కొనుగోలు చేయాలనే ప్రతిపాదనలకు మంత్రివర్గం అంగీకారం తెలిపింది. 104 అంబులెన్స్లను మరిన్ని కొనుగోలు చేయడం ద్వారా ఏజెన్సీ గ్రామాలకు మేలు కలిగించినట్టువుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. కొత్త అంబులెన్సుల్లో మెజారిటీ సంఖ్యను ఏజెన్సీ గ్రామాలకు కేటాయించాలని ఆయన సూచించారు. విజయవాడ సమీపంలోని గుణదల వద్ద కొత్తగా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి మంత్రివర్గం అంగీకరించింది.