రేపు ఏపీ కేబినెట్- జూన్లో బడ్డెట్ సమావేశాలు, మండలి ఛైర్మన్ ఎన్నిక
ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి వచ్చే నెల రోజులు కీలకంగా మారనున్నాయి. బడ్డెట్ సమావేశాలతో పాటు పెండింగ్లో ఉన్న మండలి ఛైర్మన్ ఎన్నిక, ఓవైపు కరోనాను ఎదుర్కోవాల్సిన పరిస్దితి, ఇలా అన్నీ కీలకమే కానున్నాయి. దీంతో రేపు జరిగే కేబినెట్ భేటీలో వీటిపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కన్పిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కల్లోలం కొనసాగుతున్న తరుణంలో మంత్రిమండలి తీసుకునే నిర్ణయాలపై ఉత్కంఠ నెలకొంది. వ్యాక్సిన్ల కొరతతో మూడో విడత వ్యాక్సినేషన్ నిర్వహించలేని పరిస్ధితుల్లో ఉండటంపైనా కేబినెట్ చర్చించబోతోంది.
రేపు ఏపీ కేబినెట్ భేటీ
ఓవైపు కరోనా కల్లోలం, మరోవైపు పాలనపై దృష్టిపెట్టాల్సిన పరిస్దితి, ఇంకోవైపు పెండింగ్లో ఉన్న ఎన్నికలు.. ఇలా ఎటు చూసినా సమస్యలతో సతమతం అవుతున్న ఏపీ ప్రభుత్వం రేపు కేబినెట్ భేటీ నిర్వహించబోతోంది. ఇందులో రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల తీరు, కొత్తగా అమలు చేయాల్సిన పథకాలు, కరోనా కల్లోలం నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలు, బడ్డెట్ సమావేశాల నిర్వహణ, మండలి ఛైర్మన్ ఎన్నికతో పాటు మరెన్నో అంశాలు కేబినెట్ ముందు చర్చకు రాబోతున్నాయి. ఇందులో మండలి ఛైర్మన్ ఎన్నిక మినహాయిస్తే మిగతా అంశాలపై కేబినెట్ తీసుకునే నిర్ణయాలపై ఉత్కంఠ నెలకొంది.
వ్యాక్సిన్ల కొరతతో చుక్కలు
దేశవ్యాప్తంగా మరో రెండు రోజుల్లో మూడో విడత వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏపీలో మాత్రం జనం వ్యాక్సిన్లు లేక అల్లాడుతున్నారు. ఇప్పటికే ఉన్న వ్యాక్సిన్లు రోగులకు, నిర్ణీత వర్గాలకు ఏమాత్రం సరిపోయే పరిస్దితి లేకపోవడంతో ఇక మే 1 నుంచి జరగాల్సిన వ్యాక్సినేషన్, జూన్ 1కి వాయిదా పడటం ఖాయమని అధికారులు బహిరంగంగానే చెప్పేస్తున్నారు. దీంతో ఇవాళ వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా మొదలుకావడం కష్టంగానే ఉంది. దీనిపై ప్రభుత్వం రేపటి కేబినెట్ భేటీలో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్దితి ఎదురవుతోంది.
జూన్లో ఏపీ బడ్జెట్ సమావేశాలు
కరోనా, స్ధానిక ఎన్నికల కారణంగా ఈ ఏడాది మార్చిలో జరగాల్సిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. దీంతో కేబినెట్ వర్చువల్ భేటీ ద్వారా మూడునెలలకు తాత్కాలిక బడ్జెట్ను ఆమోదించింది. దీని గడువు జూన్లో ముగియబోతోంది. అంటే జూన్లో తప్పనిసరిగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి బడ్డెట్ ఆమోదిస్తే తప్ప జూలై నుంచి నిధులకు గండం తప్పదు. అసలే కరోనా సమయం నిదుల విడుదలతో సమస్యలు ఎదురైతే ప్రభుత్వం చిక్కుల్లో పడుతుంది. దీంతో జూన్లో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ప్రభుత్వం దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
జూన్లోనే మండలి ఛైర్మన్ ఎన్నిక
ఏపీ శాసనమండలి ఛైర్మన్గా ఉన్న ఎం.ఎ షరీఫ్ పదవీకాలం ఈ ఏడాది జూన్ నెలతో ముగుస్తుంది. దీంతో ఆయన స్దానంలో కొత్త ఛైర్మన్ను మండలి సభ్యులు ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే వైసీపీకి మండలిలో మెజారిటీ వచ్చింది. దీంతో తమకున్న సభ్యుల బలంతో కొత్త ఛైర్మన్ ఎన్నిక కోసం వైసీపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఛైర్మన్గా ఎస్సీ లేదా బీసీ వర్గాలకు చెందిన నేతకు ఇవ్వాలా లేక షరీఫ్ స్దానంలో మరో మైనారిటీ నేతకే అవకాశం ఇవ్వాలా అన్న దానిపై వైసీపీలో తర్జనభర్జన కొనసాగుతోంది. దీనిపై త్వరలో తుది నిర్ణయం తీసుకుంటారు.