నేడు ఏపీ కేబినెట్ భేటీ-అసెంబ్లీ, రాజధానులు, కడప స్టీల్ సహా కీలక అజెండా-మంత్రులకు స్పెషల్ ?
ఏపీలో తాజా పరిణామాల నేపథ్యంలో ఇవాళ మంత్రివర్గం సమావేశం కాబోతోంది. ఇవాళ కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలు చర్చకు రాబోతున్నాయి. ఇందులో అసెంబ్లీ శీతాకాల సమావేశాల నిర్వహణ, ఆమోదించాల్సిన బిల్లులు, రాజధానుల తరలింపు, సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు, కడప స్టీల్ ప్లాంట్ పనుల ప్రారంభం వంటి అంశాలు చర్చకు రాబోతున్నాయి. వీటిపై సీఎం జగన్ మంత్రులతో చర్చించి కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశముంది.

ఏపీ కేబినెట్ భేటీ
ఏపీలో మరో 16 నెలల్లో ఎన్నికలకు సిద్ధమవుతున్న ప్రభుత్వం.. ఆలోపు చేపట్టాల్సిన కార్యాచరణపై తీవ్రంగా మథన పడుతోంది. దీంతో త్వరలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు ఏపీ కేబినెట్ ఇవాళ భేటీ అవుతోంది.
ఉదయం 11 గంటలకు వెలగపూడి సచివాలయంలో కేబినెట్ భేటీ జరగబోతోంది. ఇందులో పలు కీలక అంశాలు చర్చకు రాబోతున్నాయి. దీంతోపాటు ఈ సమావేశంలో సీఎం జగన్ మంత్రులతో ప్రత్యేకంగా మాట్లాడబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ్టి కేబినెట్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

అజెండాలో అసెంబ్లీ, రాజధానులు
ఇవాళ జరిగే కేబినెట్ భేటీ అజెండాలో అసెంబ్లీ శీతాకాల సమావేశాల నిర్వహణపై ప్రభుత్వం ప్రధానంగా చర్చించే అవకాశముంది. డిసెంబర్ చివరి వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్న ప్రభుత్వం ఇందులో ఏయే అంశాల్ని చర్చించాలనే దానిపై ఇవాళ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే ఈ సమావేశాల్లో రాజధానుల తరలింపుకు సంబంధించి కూడా ఏదైనా నిర్ణయం తీసుకుంటే బావుంటుందన్న భావన ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అమరావతిపై సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపైనా ఈ భేటీలో సీఎం జగన్ మంత్రులతో చర్చించబోతున్నారు.

కడప స్టీల్ సహా కీలక ప్రాజెక్టులకు ఆమోదం
నిన్న జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి భేటీలో కడప స్టీల్ ప్లాంట్ సహా పలు కీలక ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. ఇవాళ వీటికి కేబినెట్ ఆమోదం కూడా లభిస్తే పనులు ప్రారంభించేందుకు వీలు కలుగుతుంది. దీంతో సీఎం సొంత జిల్లాలోనే ఉన్న పెండింగ్ ప్రాజెక్టు కడప స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభించేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతోంది. అలాగే రాష్ట్రంలో మరో నాలుగు విద్యుత్ ప్రాజెక్టుల విషయంలోనూ కేబినెట్ చర్చించి ఆమోదం తెలపబోతోంది. ఈ ప్రాజెక్టులు పూర్తయితే విద్యుత్ సమస్యలు తగ్గుతాయి. దీంతో కేబినెట్ ఈ అంశాన్ని ప్రాధాన్యంగా తీసుకోబోతోంది.

జనవరి పథకాలకూ ఆమోదం !
అలాగే వచ్చే నెలలో రాష్ట్రంలో అమలు చేసే పలు సంక్షేమ పథకాలకు సంబంధించి మంత్రివర్గం చర్చించి క్లియరెన్స్ ఇవ్వబోతోంది. ఆయా పథకాలకు కేబినెట్ ఆమోదం లభిస్తే వాటిని సీఎం జగన్ బటన్ నొక్కి విడుదల చేసేందుకు వీలు కలుగుతుంది. అలాగే బడ్జెట్ కేటాయింపులకు కూడా అవకాశం దొరుకుతుంది. కేబినెట్ ఇవాళ చర్చించే జనవరి సంక్షేమ పథకాల్లో వైఎస్సార్ ఆసరా, రైతు భరోసా, జగనన్న తోడు పథకాలు ఉన్నాయి. వీటిపై కేబినెట్ పై చర్చించి ఆమోదిస్తారు.

మంత్రులతో జగన్ ప్రత్యేక భేటీ ?
ఈ మధ్య కాలంలో జరిగిన కేబినెట్ భేటీల్లో ప్రతిసారీ సీఎం జగన్ తరచుగా మంత్రులతో ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు. కేబినెట్ లో చర్చించాల్సిన అజెండా ముగిసిన తర్వాత మంత్రులతో సమావేశమవుతున్న జగన్.. తాజా రాజకీయ పరిణామాల్ని వారితో చర్చిస్తున్నారు. అలాగే వారిలో నిర్లక్ష్యంగా ఉంటున్న వారికి హెచ్చరికలు పంపుతున్నారు. గడప గడప వంటి కార్యక్రమాల అమలుపై ఆరా తీస్తున్నారు. దీంతో పాటు ఎన్నికల నాటికి అమలు కావాల్సిన అంశాలకు సంబంధించి, విపక్షాలకు ఇవ్వాల్సిన కౌంటర్లపైనా చర్చిస్తున్నారు. ఇవాళ కూడా మరోసారి ఇవే అంశాలపై మంత్రులతో జగన్ మాట్లాడబోతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications