ఏపీ మంత్రివర్గ భేటీ- మహిళలకు ఉచిత బస్సు విధి విధానాలు ఖరార్?
Amaravati: రాజధాని అమరావతిపై నిర్మాణ వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. ముందడుగు వేయబోతోంది. నిర్మాణాలకు శ్రీకారం చుట్టబోతోంది.
అమరావతిలో నిర్మాణాలు పునః ప్రారంభానికి నోచుకున్న నేపథ్యంలో.. ఈ పనుల్లో వేగం పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిర్ణీత గడువులోగా ప్రధాన భవన సముదాయాలను అందుబాటులోకి తీసుకుని రావాలని భావిస్తోంది. దీనికి అనుగుణంగా అన్ని రకాల చర్యలు చేపట్టింది.

ఈ పరిస్థితుల మధ్య బుధవారం రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షత వహించనున్నారు. రాజధాని నిర్మాణ పనులకు సంబంధించి ఇటీవలే సీఆర్డీఏ ఆమోదించిన తీర్మానాలు మంత్రివర్గం ముందుకు చర్చకు రానున్నాయి. వాటిని మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడానికి అవసరమైన మార్గదర్శకాలు, విధి విధానాలపై మంత్రివర్గం చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏ జిల్లాకు చెందిన వాళ్లు ఆ జిల్లా పరిధిలో మాత్రమే ఉచితంగా ప్రయాణించేలా ఈ విధి విధానాలు ఉంటాయని సమాచారం.
రాజధాని పరిధిలోని అమరావతి- 4, తుళ్లూరు మండలం పరిధిలోకి వచ్చే మూడు 3 గ్రామాల్లో అదనంగా 20,494 ఎకరాల మేర భూ సమీకరించాలని సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో నిర్ణయించిన విషయం తెలిసిందే. దీన్ని మంత్రివర్గం యధాతథంగా ఆమోదించే అవకాశాలు ఉన్నాయి.
రాజధానిలో హైడెన్సిటీ రెసిడెన్షియల్ జోన్ సహా మిశ్రమ అభివృద్ధి ప్రాజెక్టులు, మందడం, రాయపూడి, పిచుకలపాలెంలోని ఫైనాన్స్, స్పోర్ట్ సిటీల్లో దాదాపు 58 ఎకరాల్లో హైడెన్సిటీ రెసిడెన్షియల్ జోన్, మిశ్రమ అభివృద్ధి ప్రాజెక్టుల నిర్మాణానికి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ పిలవడానికి మంత్రివర్గం పచ్చజెండా ఊపవచ్చు.
అమరావతిలో నిర్మించే ఫైవ్ స్టార్ హోటళ్ల సమీపంలో కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణం కోసం సీఆర్డీఏ ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. మందడం, తూళ్లురు, లింగాయపాలెంలో 2.5 ఎకరాల చొప్పున నాలుగు చోట్ల కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి క్యూబీఎస్ ప్రాతిపదికన అమోదం తెలిపే అవకాశాలు లేకపోలేదు.
సీబీఐ, జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ, ఎంఎస్కే ప్రసాద్ క్రికెట్ అకాడమీ, కిమ్స్ సహా 16 సంస్థలకు 65 ఎకరాల మేర భూ కేటాయింపులకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వొచ్చు. రాజధానిలోని ఈ-15 రహదారిపై 6 లేన్ల ఆర్వోబీ నిర్మాణం, పొట్టి శ్రీరాములు, అల్లూరి సీతారామరాజు స్మారక చిహ్నాలను నెలకొల్పడానికి అవసరమైన స్థలం కేటాయించడానికీ మంత్రివర్గం ఆమోదం తెలపవచ్చు.












Click it and Unblock the Notifications