చంద్రబాబుపై మంత్రుల అలక, జగన్కే టీడీపీ నేత పొగడ్తలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన సొంత పార్టీ ముఖ్య నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారా? అంటే అవుననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మంగళవారం నాడు ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి చేసిన వ్యాఖ్యల పైన మరింత ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.
ప్రధానంగా రాయలసీమ ప్రాంత నేతలు రాజధాని విషయమై చంద్రబాబు పైన అసంతృప్తితో ఉన్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మంగళవారం శాసన సభ ప్రాంగణంలో కేఈ ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు పైన అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని ప్రశంసించడం గమనార్హం.
ఏపీ రాజధాని శంకుస్థాపనకు రెండేళ్లు పడుతుందని, అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకొని రాజధాని పనులు ప్రారంభిస్తామని కేఈ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజధాని ఏర్పాటు కోసం భూములు కోల్పోయిన వారి తరపున జగన్ మాట్లాడి మైలేజ్ పొందారని అభిప్రాయపడ్డారు.
చంద్రబాబు సభలో మంత్రులకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, ప్రతిదానికి ఆయే మాట్లాడటం ప్రతిపక్షానికి కలిసి వస్తుందని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా, గతంలో కంటే జగన్ ఇంప్రూవ్ అయ్యారని, ఆయన షైన్ అయ్యారన్నారు. విభజన చట్టంలో కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చుకునే బాధ్యత చంద్రబాబుపై ఉందన్నారు.
రాజధాని నిర్మాణానికి రాయలసీమ మద్దతు ఉంటుందని చెప్పారు. తమకు ప్రధానంగా కావాల్సింది సాగునీరు అని చెప్పారు. ఇప్పుడు కేఈ కృష్ణమూర్తి చేసిన వ్యాఖ్యలు ఇటు అధికార పార్టీలో, అటు ప్రతిపక్షంలో చర్చనీయాంశమయ్యాయని చెబుతున్నారు.
రాయలసీమ ప్రాంత నేతలు కర్నూలును రాజధాని చేయాలని మొదట్లో డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అదే అసంతృప్తి వారిలో ఉన్నట్లుగా కనిపిస్తోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గతంలో మంత్రి పరిటాల సునీత రెండో రాజధాని కోసం అడిగారని, జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ.. రాజధానిపై మనం నిర్ణయించేది కాదని ఒకింత అసహనంతో అన్నారని గుర్తు చేస్తున్నారు.