ఏపీ రాజధాని అమరావతికి కేంద్రం వరాలు
Amaravati: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. రాజధాని అమరావతి నిర్మాణంపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించింది. కేంద్రం నుంచి భారీ ప్రాజెక్టులను మంజూరు చేయించుకుంటోంది.
ఇప్పటికే కొత్త రైల్వే లైన్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది అమరావతికి. ఇన్నర్ రింగ్ రోడ్, ఐకాన్ బ్రిడ్జి వంటి ప్రాజెక్టులు క్రమంగా రూపుదాల్చుకుంటోన్నాయి. మెట్రో రైలు ప్రాజెక్ట్ సంబంధించిన డీపీఆర్ సైతం సిద్ధమైంది. అమరావతి పరిధిలో దశలవారీగా మెట్రో రైలు పట్టాలెక్కబోతోంది.

ఈ పరిస్థితుల మధ్యయ తాజాగా కేంద్ర ప్రభుత్వం అమరావతికి మరో శుభవార్త వినిపించింది. ఏపీ రాజధాని అమరావతిలో ఈఎస్ఐ ఆసుపత్రి, సూపర్ స్పెషాలిటీ మెడికల్ కాలేజీ ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. 500 పడకల సామర్థ్యం గల ఆసుపత్రి ఇది. అలాగే- సూపర్ స్పెషాలిటీ మెడికల్ కాలేజీ పడకల సామర్థ్యం.. 150.
ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్లో ఈఎస్ఐ ఆసుపత్రి ఉన్నప్పటికీ- విభజన తరువాత అది తెలంగాణ వాటా కిందికి వెళ్లింది. దీనితో ఏపీకీ ఈఎస్ఐ ఆసుపత్రిని మంజూరు చేయాలంటూ గతంలో చంద్రబాబు- పవన్ కల్యాణ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.
మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలకు ప్రకారం ఓ ఈఎస్ఐ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయాలంటే 25 ఎకరాలు అవసరమౌతాయి. అలాగే- ఈఎస్ఐసీ నిబంధనల ప్రకారం 500 పడకల ఆసుపత్రి నిర్మాణానికి 10 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించాల్సి ఉంటుంది.
భూములను కేటాయించడానికి చంద్రబాబు- పవన్ కల్యాణ్ ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. దీనితో కేంద్రం ఈ భారీ ప్రాజెక్ట్ను అమరావతికి మంజూరు చేసినట్లు చెబుతున్నారు. ఈ రెండింటినీ కేంద్రమే నిర్మించదలిచితే రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక భారం తప్పినట్టవుతుంది.












Click it and Unblock the Notifications