బాబు ప్రకటన: బెజవాడలో సంబరం, సీమలో నిరసన
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉంటుందని శాసన సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడంపై బెజవాడ ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. విజయవాడ నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద పార్టీ నేతలు, కార్యకర్తలు పలువురు సంతోషంతో మిఠాయిలు పంచుకున్నారు. పలుచోట్ల స్థానికులు బాణాసంచా కాల్చి ఆనందం వ్యక్తం చేశారు.
మరోవైపు, రాజధాని ప్రకటనపై రాయలసీమలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మొదటి నుండి రాయలసీమలో ఒక ప్రాంతాన్ని రాజధానిగా చేయాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రధానంగా కర్నూలును రాజధానిగా చేయాలని డిమాండ్ వినిపిస్తున్న విషయం తెలిసిందే.
కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ఏడు మిషన్లు, ఐదు గ్రిడ్లు ఏర్పాటు చేయనున్నట్లు చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. కొత్త రాజధాని పైన సభలో ఇరవై పేజీల ప్రకటన విడుదల చేశారు.
వాటర్, పవర్, గ్యాస్, రోడ్డు బ్రాండ్ బ్యాండ్లకు ప్రత్యేక గ్రిడ్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. విజయవాడ, తిరుపతి విమనాశ్రయాలను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. అనంతపురం కరవు నివారకు బిందు, తుంపర సేద్యాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నామన్నారు.