ఏపీ వ్యాప్తంగా సంజీవని ప్రాజెక్ట్..! చంద్రబాబు కీలక ప్రకటన..!
రాష్ట్ర ప్రజలకు వచ్చే వ్యాధుల్ని ముందస్తుగా గుర్తించి చికిత్సలు అందించే లక్ష్యంతో ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్ గా ప్రారంభించిన సంజీవని.. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనుంది. ఆగస్టు 15న దీన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని నిర్ణయించినట్లు సీఎం చంద్రబాబు (Chandrababu) ఇవాళ చిత్తూరు జిల్లా పూతలపట్టులో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రకటించారు. ప్రివెంటివ్, ప్రిడిక్టివ్, క్యూరెటివ్ అనే మూడు సూత్రాల ఆధారంగా ఈ వ్యవస్థ పని చేస్తుందని ఆయన తెలిపారు.
ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు. దీనికోసం రాష్ట్రంలో ప్రజారోగ్యాన్ని సంరక్షించేలా సంజీవని కార్యక్రమం అమలు చేయనున్నట్టు వెల్లడించారు. సంజీవని కేవలం ఒక సాఫ్ట్వేర్ మాత్రమే కాదని, ఇది ఓ సమగ్ర డిజిటల్ పబ్లిక్ హెల్త్ ఆపరేటివ్ సిస్టమ్ అని ముఖ్యమంత్రి అభివర్ణించారు. ఇల్ నెస్ నుంచి వెల్ నెస్ దిశగా ఏపీ అడుగులు వేస్తోందని సీఎం స్పష్టం చేశారు.

ఏదైనా వ్యాధిని ముందస్తుగా గుర్తించటం, వ్యాధి రాకముందే నివారణ, చికిత్సల ద్వారా ప్రజారోగ్యాన్ని కాపాడతామని చంద్రబాబు తెలిపారు. వ్యక్తిగత డిజిటల్ హెల్త్ రికార్డులను వైద్యులు నిరంతరం పర్యవేక్షించేలా ఈ వ్యవస్థ సేవలందిస్తుందని వెల్లడించారు. కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన సంజీవని కార్యక్రమం... ఈ ఏడాది మార్చి నుంచి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అమల్లో ఉందని.... ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి ప్రకటించారు. 42 వైద్య పరీక్షలను ఇంటి వద్దే నిర్వహించి రిపోర్టులు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. ప్రజారోగ్యానికి అవసరమైన ప్రతీ అంశాన్ని సంజీవని ప్రాజెక్టు ద్వారా పర్యవేక్షిస్తామని తెలిపారు. డాక్టర్ అప్పాయింట్మెంట్, వర్చువల్ కనెక్ట్ ద్వారా వైద్య సలహాలు అందిస్తామన్నారు.














Click it and Unblock the Notifications