నిరుపేదల ఆరోగ్య రక్షణకు ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగానికి పెద్దపీట వేస్తోంది. పేదలు మరియు సామాన్య ప్రజల ఆరోగ్య సేవలను మెరుగుపరచడం కోసం ఏఐ ఆధారిత డిజిటల్ ఆరోగ్య వ్యవస్థ 'సంజీవని'ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలోని 5.20 కోట్ల మంది జనాభాకు ఆధునిక వైద్య సేవలు సులభంగా అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో దీనిని ప్రారంభిస్తోంది.
సంజీవని ప్రాజెక్ట్ ఇందుకే.. పైలెట్ ప్రాజెక్ట్ సక్సెస్
సంజీవని ప్రాజెక్టు రోగనిర్ధారణ నుంచి చికిత్స, నిరంతర పర్యవేక్షణ వరకు ఒక్క చోట నుంచి అన్ని సేవలు అందించే ఏకీకృత డిజిటల్ ప్లాట్ఫామ్ గా పని చేయనుంది. దీని ద్వారా ముందస్తు ఆరోగ్య పరీక్షలు, వ్యాధుల నివారణ, సకాలంలో చికిత్స అందించడం సాధ్యమవుతుంది. ప్రస్తుతం చిత్తూరు జిల్లా కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా విజయవంతంగా అమలవుతోంది.

కుప్పంలో సంజీవని.. ఆ జిల్లాలకు విస్తరణ
గత ఏడాది జులైలో టాటా డిజిటల్ నెర్వ్ సెంటర్ ద్వారా కుప్పంలో సీఎం చంద్రబాబు నాయుడు సంజీవని ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఇక్కడ 3 లక్షల మందిని డిజిటల్గా అనుసంధానం చేశారు. ఫలితాలు ఆశాజనకంగా ఉండటంతో చిత్తూరు జిల్లా మొత్తం 18 లక్షల మందికి విస్తరించారు. ప్రస్తుతం తిరుపతి, అన్నమయ్య జిల్లాలలోని కొన్ని మండలాల్లో కూడా సేవలు అందుతున్నాయి.
అన్ని చోట్ల సంజీవని సేవలు
33 మండలాల్లోని ఒక ప్రాంతీయ ఆసుపత్రి, సమాఖ్య ఆసుపత్రులు, 66 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 484 విలేజ్ హెల్త్ క్లినిక్లలో సంజీవని సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకు ఇంటిగ్రేటెడ్ హెల్త్కేర్ డెలివరీ ప్లాట్ఫామ్ ద్వారా 1.75 లక్షల ఔట్ పేషెంట్ నమోదు కాగా, 3.69 లక్షల మందికి మందులు, 21,441 ల్యాబ్ పరీక్షలు జరిగాయి. టెలి-కన్సల్టేషన్ ద్వారా 1.20 లక్షల మంది, స్పెషలిస్ట్ కన్సల్టేషన్ ద్వారా 5,275 మంది ప్రయోజనం పొందారు.
సంజీవనితో అందరికీ ఆరోగ్య పరీక్షలు
సంజీవని సిటిజన్ వెల్నెస్ యాప్ను 4,691 మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ప్రభుత్వం మధుమేహం, రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులున్న 71 లక్షల మంది మరియు వసతి గృహాల్లో ఉండే విద్యార్థులందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని యోచిస్తోంది. 108, 104 అత్యవసర సేవలు, ఆయుష్ వైద్య వ్యవస్థలను కూడా ఈ ప్లాట్ఫామ్తో అనుసంధానం చేయనున్నారు.అయితే సాంకేతిక, ఆర్థిక, మానవ వనరుల సమస్యల వల్ల రాష్ట్రవ్యాప్త అమలు కొంత ఆలస్యం అవుతోంది.
ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య రంగంలో డిజిటల్ విప్లవం
జులై నుంచి అమలు చేయాలని లక్ష్యం అయినా మరో నాలుగు-ఐదు నెలలు పట్టవచ్చని అంచనా. ప్రతి జిల్లాకు సమన్వయ అధికారి, ఇంప్లిమెంటేషన్ స్పెషలిస్టులు, పేషెంట్ కేర్ మేనేజర్లను నియమించాలని ప్రణాళిక. ప్రతి పీహెచ్సీకి రూ.4 లక్షలు ఖర్చు చేసి ఐటీ మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంది. సంజీవని ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అమలైతే ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య రంగంలో డిజిటల్ విప్లవం సాధించి, పేదలు మంచి వైద్య సేవలు పొందేలా చేస్తుంది.













Click it and Unblock the Notifications