రాజధానిలో క్రికెట్ స్టేడియం, సింగపూర్ భారీ పెట్టుబడి
అమరావతి: ఏపీ కొత్త రాజధాని అమరావతిలో కాలువలు, వాటి వెంట పచ్చదనం ఉండేలా పార్కులు నిర్మించాలని ప్రణాళిక రూపొందింది. రాజధాని నగర ప్రణాళిక రూపొందిస్తున్న సింగపూర్ ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.
అందులో 45 చదరపు కిలోమీటర్లకు పైగా విస్తీర్ణంలో పార్కుల రూపంలో పచ్చధనాన్ని అభివృద్ధి చేయాలని సిఫార్సు చేసింది. రాజధాని నగరంలో 116 కిలోమీటర్ల పొడవున ఇవి ఉంటాయి. ఇందులో సుమారు వెయ్యేసి ఎకరాల విస్తీర్ణంలోసివిక్ పార్క్, సెంట్రల్ పార్కులను ప్రతిపాదించింది.
ఇటలీలోని వెనిస్ నగరంలో ఉన్నట్లు రాజధాని నగరం వలయం మాదిరి కాలువలను ఏర్పాటు చేసి 365 రోజులూ నీరు ఉండేలా చూడాలని సూచించింది. ప్రకాశం బ్యారేజీ నుండి 35 కిలోమీటర్ల ఎగువన రాజధాని నగరంలోకి ప్రారంభమయ్యే కాలువల వ్యవస్థ రాజధాని అంతటా వలయంలా వ్యాపించి చివరకు బ్యారేజీ పక్కన గానీ, దిగువన గానీ తిరిగి కృష్ణానదిలోకి కలిపేలా ఉండాలని సూచించింది.
రాజధాని పరిధిలో ఉండే మంగళగిరిలో ఇప్పటికే ఒ క్రికెట్ స్టేడియం ఉంది. క్రికెట్కు ఉన్న ఆదరణ నేపథ్యంలో అంతర్జాతీయస్థాయి స్టేడియాన్ని నిర్మించాలని సిఫార్సు చేసింది. దీనిని బహుళ ప్రయోజనకర స్టేడియంగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది.
అమరావతి నగర నిర్మాణానికి రూ.70 వేల కోట్ల వరకూ పెట్టుబడులు వెచ్చించే యోచనలో సింగపూర్ ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తం పదేళ్ల వ్యవధిలో రాజధానికి సంబంధించిన భవనాలు, మౌలిక వసతులు, ఐటీ పార్కులు, పర్యాటక, వినోద కేంద్రాల నిర్మాణంపై ఈ పెట్టుబడి పెట్టాలని ఆ ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.
రాజధాని నిర్మాణానికి మాస్టర్ డెవలపర్ ఎంపికకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆహ్వానానికి స్పందనగా సింగపూర్ ప్రభుత్వం తన బిడ్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. రాజధాని నిర్మాణానికి ఎంపికయ్యే మాస్టర్ డెవలపర్ నిధుల సేకరణ బాధ్యత కూడా తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిబంధన విధించింది.
దానికి అంగీకరిస్తూ సింగపూర్ తన బిడ్ దాఖలు చేసింది. దీనిపై ఉభయ ప్రభుత్వాల అధికార వర్గాల మధ్య ఇప్పటికే కొంత చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో తాము ఎంత పెట్టుబడి పెట్టదల్చుకున్నామన్నది సింగపూర్ అధికారులు సూచనప్రాయంగా వెల్లడించినట్లు సమాచారం. సరాసరిన ఏడాదికి రూ. 6,000 కోట్ల నుంచి 7,000 కోట్ల వరకూ రాజధాని నిర్మాణంపై వెచ్చించడానికి సింగపూర్ సిద్ధంగా ఉంది.