డబ్బులిచ్చి వైన్ షాప్కు పంపుతున్నారు.. చంద్రబాబుపై వైసీపీ ఫైర్.. టీడీపీ చీఫ్ ఎమన్నారంటే..
మామూలుగానే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అగ్గి మీద గుగ్గిలంలా మండిపోతుంటాయి.. ఇప్పుడు దానికి మద్యం కూడా తోడు కావడంతో ఆ సెగలు ఢిల్లీనీ తాకుతున్నాయి. లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన మద్యం అమ్మకాలపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల దాడి తారాస్థాయికి చేరంది. సంపూర్ణ మద్యనిషేధం అమలుచేస్తానన్న సీఎం జగన్.. కరోనా విలయ సమయంలో వైన్ షాపులు తెరవడమేంటని ప్రత్యర్థులు ఆక్షేపిస్తోంటే.. అసలు మద్యం అమ్మకాలకు అనుమతిచ్చిన మోదీని ఎందుకు ప్రశ్నించడంలేదని వైసీపీ ఎదురుదాడికి దిగింది..
Recommended Video

చంద్రబాబు విజ్ఞప్తి..
తొలి రోజు మద్యం షాపుల వద్ద సీన్లు చూసి షాక్కు గురయ్యానన్న చంద్రబాబు.. రెండోరోజైన మంగళవారం నేరుగా మందుబాబులకు సందేశమిచ్చారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలెవరూ మద్యం కోసం వైన్ షాపులకు వెళ్లొద్దని, ఇలాంటి కఠిన సమయంలోనే అందరం స్వీయనియంత్రణ పాటించాలని విజ్ఞప్తి చేశారు. మద్యం షాపుల వద్ద గుమ్మికూడే బదులు.. ప్రభుత్వం చేస్తోన్న తప్పుడు పనులపై మనలో మనం చర్చించుకుందామని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరికీ మూడు మాస్కులు ఇస్తానన్న ప్రభుత్వం.. కనీసం రెడ్జోన్లలోనూ వాటిని పంచలేకపోయిందని మండిపడ్డారు.

జగన్వి కుర్రచేష్టలు..
కరోనా మహమ్మారిని తేలికచేసి మాట్లాడం నుంచి ఇప్పుడు యధేచ్ఛగా మద్యం అమ్మకాల దాకా వైరస్ విషయంలో సీఎం జగన్ ప్రజల ప్రాణాలను బలిపెడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. ‘‘ముఖ్యమంత్రి జగన్వి అన్నీ కుర్రచేష్టలు. బాధ్యత గల వ్యక్తిలా ఆయన ప్రవర్తించడంలేదు. నిత్యావసరాల కోసం కేవలం 3 గంటలు టైమిచ్చి, మద్యం అమ్మకాకు మాత్రం 8 గంటల గడువివ్వడం దారుణం. గతంలో మెడికల్ షాప్కు వెళ్తోన్న ప్రజల్ని సైతం చావబాదిన పోలీసులకు ఇప్పుడు మద్యం షాపుల వద్ద రద్దీ కనిపించడం లేదా? అయినా, ధరలు పెంచడం వల్ల మద్య నిషేధం ఎక్కడైనా జరిగిందా?''అని ప్రశ్నలు సంధించారు.

ఏపీకి వెళితే క్వారంటైన్లో ఉంటా..
కరోనా మహమ్మారికి భయపడి చంద్రబాబు హైదరాబాద్ పారిపోయాడని, ఎప్పటికైనా ఆయన ఏపీకి వస్తే కచ్చితంగా క్వారంటైన్ కు తరలిస్తామంటూ వైసీపీ నేతలు చేస్తోన్న కామెంట్లపై టీడీపీ చీఫ్ ఘాటుగా స్పందించారు. ‘‘ఎస్, ఏపీకి వెళితే క్వారంటైన్ లో ఉండటానికి నేను రెడీ. ఎక్కడ పెట్టినా నాకు అభ్యంతరంలేదు. కానీ క్వారంటైన్ సెంటర్లలో కరోనా టెస్టులు చేస్తున్నారా? దమ్ముంటే ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పగలదా?''అని చంద్రబాబు జగన్ కు సవాలు విసిరారు.

బాబు వల్లే రద్దీ..
ప్రజలు మద్యం షాపులకు వెళ్లొద్దంటూ చంద్రబాబు పిలుపునిచ్చిన కొద్దిసేపటికే మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. నిజానికి మద్యం షాపుల వద్ద కనిపిస్తున్నవాళ్లంతా సాధారణ ప్రజలు కారని, టీడీపీ నేతలు తమ పార్టీ కార్యకర్తలకు డబ్బులిచ్చిమరీ క్యూలైన్లలో నిలబెడుతున్నారని, సోషల్ డిస్టెన్స్ పాటించొద్దని చెప్పిమరీ కార్యకర్తల్ని పంపుతున్నారని మంత్రి సంచలన ఆరోపణ చేశారు. లిక్కర్ బ్రాడ్లపై అంతగా అనుమానాలుంటే, చంద్రబాబు ఎక్కడ చెబితే అక్కణ్నుంచే కొనుగోలు చేస్తామని ఎద్దేవా చేశారు.

మోదీని అడగరేం?
దశలవారీగా మద్యనిషేధానికి వైసీపీ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని, అందులో భాగంగానే లిక్కర్ ధరల్ని పెంచి, అమ్మకాల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నామని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు చెప్పారు. అయినా, మద్యం అమ్మకాలకు అనుమతిచ్చిన మోదీని కాకుండా, ఏపీ ప్రభుత్వాన్ని చంద్రబాబు ప్రశ్నించడమేంటని ఆయన వాపోయారు. మోదీని ఎక్కడ ప్రశ్నిస్తే జైల్లో పడేస్తాడనే భయంతోనే చంద్రబాబు కేంద్రంపై కిక్కురుమనకుండా ఉంటూ, ఏపీపై మాత్రం బడాయికి పోతున్నారని అంబటి మండిపడ్డారు.












Click it and Unblock the Notifications