Chandrababu : జైల్లో చంద్రబాబు విచారణ మొదలు-కట్టుదిట్టమైన భద్రత మధ్య..!
ఏపీలో సంచలనం రేపుతున్న స్కిల్ డెవల్మెంట్ స్కాంలో సీఐడీ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే ఈ స్కాంలో అరెస్టు చేసి రిమాండ్ కు పంపిన టీడీపీ అధినేత చంద్రబాబును ఇవాళ రాజమండ్రి జైల్లో సీఐడీ అదుపులోకి తీసుకుంది. ఏసీబీ కోర్టు అనుమతి మేరకు ఉదయం వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత చంద్రబాబును కస్టడీలోకి తీసుకున్న సీఐడీ అధికారులు 9.30కు విచారణ ప్రారంభించారు.

చంద్రబాబును అరెస్టు చేసేందుకు ఉదయం రాజమండ్రి చేరుకున్న 12 మంది సీఐడీ అధికారులు, సిబ్బందితో కూడిన బృందం సెంట్రల్ జైలుకు వచ్చింది. అనంతరం చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించి కస్టడీలోకి తీసుకుంది. కోర్టు ఆదేశాల మేరకు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకే విచారించే అవకాశం ఉండటంతో అప్పటికే సిద్ధం చేసుకున్న ప్రశ్నావళితో చంద్రబాబుకు ప్రశ్నలు సంధిస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు చంద్రబాబును సీఐడీ బృందం విచారించేందుకు రావడంతో రాజమండ్రి జైలు వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. బయటి నుంచి అనుమతించే విషయంలోనూ, అలాగే లోపల కూడా భద్రత పెంచారు. సీఐడీ అధికారులు ఇవాళ, రేపు కూడా విచారణ కొనసాగించే అవకాశం ఉండటంతో ములాఖత్ లకు కూడా అనుమతి ఇవ్వడం లేదని తెలుస్తోంది. మరోవైపు సీఐడీ విచారణ కు చంద్రబాబు ఎంతమేరకు సహకరిస్తారన్న దానిపై ఆయన కస్టడీ పొడిగింపు లేదా బెయిల్ వ్యవహారం కూడా ఆధారపడి ఉండబోతోంది.












Click it and Unblock the Notifications