టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబుపై పాత కేసు తిరగతోడిన సీఐడీ-ఉద్యోగుల పీఆర్సీ పోరు వేళ
ఏపీలో ఉద్యోగసంఘాల పీఆర్సీ పోరు టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు మెడకు చుట్టుకుంది. పీఆర్సీ కోసం ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి మద్దతిస్తున్నారని ప్రభుత్వం అనుమతిస్తున్న అశోక్ బాబుపై ఏపీ సీఐడీ పాత కేసును తిరగతోడింది. తాజాగా అశోక్ బాబుపై సెక్షన్ 477A,465,420 కింద సీఐడీ కేసు నమోదు చేసింది.
గతంలో అశోక్ బాబు అసిస్టెంట్ కమర్షియల్ ట్సాక్స్ ఆఫీసర్ గా పనిచేసే సమయంలో బీకాం చదవకపోయినా చదివినట్టు తప్పుడు సమాచారం ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. కొంతమంది అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చి రికార్డులను ట్యాంపరింగ్ చేసినట్లు అశోక్ బాబుపై ఆరోపణలు ఉన్నాయి. ఆయన తప్పుడు సమాచారం ఇచ్చారని మెహర్ కుమార్ అనే ఉద్యోగి గతంలో లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. దీంతో స్పెషల్ చీఫ్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ నుంచి లోకాయుక్త రిపోర్ట్ తెప్పించుకుని పరిశీలించారు. గతేడాది ఆగస్టులో అశోక్బాబు కేసును సీఐడీకి అప్పగించాలంటూ లోకాయుక్త ఆదేశాలు ఇచ్చారు. ఆ తర్వాత ఏం చర్యలు తీసుకున్నారో కూడా తమ దృష్టికి తీసుకురావాలని లోకాయుక్త తమ ఆదేశాల్లో పేర్కొన్నారు.

అనంతరం అశోక్ బాబు ఇచ్చిన తప్పుడు సమాచారంపై జాయింట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్ గీతామాధురి సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. గీతా మాధురి ఫిర్యాదుతో సీఐడీ తాజాగా కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల అఫిడవిట్లో కూడా తాను గ్రాడ్యుయేట్ అంటూ టిడిపి ఎమ్మెల్సీ అశోక్ బాబు తప్పుడు సమాచారం ఇచ్చినట్లు అభియోగాలు నమోదు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రంలో ప్రస్తుతం సాగుతున్న ఉద్యోగసంఘాల పీఆర్సీ పోరుకు అశోక్ బాబు సహకారం అందిస్తున్నట్లు ప్రభుత్వం అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనపై కేసులు నమోదు చేసి టార్గెట్ చేస్తున్నట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications