డాక్టర్ అనితారాణి కేసులో ఏపీ సీఐడీ విచారణ - మహిళా కమిషన్లో సుమోటో కేసు
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ అనితారాణి వైసీపీ నేతలు, అధికారులపై చేసిన ఆరోపణలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటోంది. అనితా రాణి ఆరోపణల వెనుక ఎవరున్నారో తేల్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే సీఐడీ విచారణకు ఆదేశించగా.. అధికారులు ఇవాళ దర్యాప్తు ప్రారంభించారు. పెనుమూరు ఆస్పత్రికి వెళ్లిన అధికారులు స్ధానికంగా ఉన్న సిబ్బంది నుంచి వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది.
డాక్టర్ అనితారాణి కిందిస్ధాయి ఉద్యోగుల అవినీతిని ప్రశ్నించినందుకు తనను వేధిస్తున్నారని, పోలీసులు కేసు కూడా నమోదు చేయడం లేదని తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే ఈ వ్యవహారంపై టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనితకు ఫిర్యాదు చేయడంపైనా ఇప్పుడు సీఐడీ దృష్టిసారిస్తోంది. ప్రభుత్వాధికారి అయి ఉండి నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ నేతలను ఆశ్రయించడం ఏంటనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో సీఐడీ ఆమెను త్వరలో ప్రశ్నించేందుకు సిద్ధమవుతోంది.
అటు మహిళా కమిషన్ కూడా డాక్టర్ అనితారాణి వ్యవహారంపై సుమోటోగా కేసు నమోదు చేసింది. మహిళా కమిషన్ ను ఆశ్రయించి ప్రయోజనం లేదని అనితారాణి వ్యాఖ్యానించిన నేపథ్యంలో కమిషన్ సుమోటోగానే కేసు నమోదు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో ఈ కేసు ఏ మలుపు తిరగబోతోందన్న ఉత్కంఠ నెలకొంది. డాక్టర్ సుధాకర్ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో అనితారాణి విషయంలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.