ఏపీలో 15 నుంచి సినిమా కష్టమే- కొత్త సినిమాల కరవు- ఆపై కరోనా రూల్స్ మంట...
కరోనా ప్రభావం మొదలయ్యాక ఈ ఏడాది మార్చిలో మూతపడిన థియేటర్లు, మల్లీప్లెక్స్లు ఏపీలో ఇప్పటికీ తెరుచుకోలేదు. కేంద్రం అన్లాక్ 5.0లో భాగంగా ఎట్టకేలకు వీటి కార్యకలాపాలు పునఃప్రారంభించేందుకు అనుమతి ఇచ్చింది. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మార్గదర్శకాలు విడుదల చేసింది. వీటిని పాటిస్తూ సినిమా థియేటర్లు, మల్లీప్లెక్స్ల్లో సినిమాలు వేసుకోవచ్చని అనుమతి కూడా ఇచ్చింది. కానీ పరిస్ధితులు మాత్రం భిన్నంగా ఉన్నాయి. కరోనా కారణంగా తలెత్తిన పరిస్ధితులు ఇంకా కుదురుకోకపోవడంతో ఈ నెల 15 నుంచి ఏపీలో బొమ్మ పడటం కష్టమే అన్న వాదన వినిపిస్తోంది.
ఏపీలో సినిమా కష్టమే...
ఏపీలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన సినిమా పరిశ్రమకు కరోనాకు కొన్నేళ్ల ముందే పైరసీ రూపంలో గడ్డుకాలం దాపురించింది. దీంతో థియేటర్లలో సినిమా విడుదలైన నెల రోజులకే ఓటీటీల్లో సినిమాలు వేసుకోవాల్సిన పరిస్ధితి తలెత్తింది. ఇదంతా సాగుతుండగానే కరోనా వచ్చింది. ఇక థియేటర్లు, మల్లీప్లెక్స్లు మూతపడటం, ఓటీటీతో తప్ప సినిమా విడుదల చేయకుండా ఆపుకునే పరిస్ధితులు లేకపోవడంతో టాలీవుడ్కు ఓటీటీలే దిక్కయ్యాయి. అయినా ఏదో ఒక రోజు థియేటర్లు తెరుచుకుంటాయని ఏదో చిన్న ఆశ. అనుకున్నట్లుగానే ఆ రోజు కూడా వచ్చేసింది. కానీ థియేటర్లు ఓపెన్ చేసే పరిస్ధితి ఉందా అంటే యాజమాన్యాల నుంచి సమాధానం రావడం లేదు. ఇప్పుడు సినిమా ప్రదర్శించే పరిస్ధితులు లేవని యాజమాన్యాలు బహిరంగంగానే చెబుతున్నాయి.
కొత్త సినిమాల కరవు...
కరోనా కొనసాగుతున్న సమయంలోనే ఏపీలో సినిమా షూటింగులకు అనుమతి కావాలని సీఎం జగన్కు టాలీవుడ్ ప్రముఖులు మొరపెట్టుకున్నారు. దానికి ఆయన కూడా అంగీకరించారు. కానీ తీరా షూటింగ్ చేద్దామంటే హీరోలు లేరు, టెక్నికల్ సిబ్బంది లేరు, చివరికి చిన్నా చితకా వేషాలు కావాలని ఏడాది పొడవునా వీరి చుట్టూ తిరిగే జూనియర్ ఆర్టిస్టులు కూడా కరువయ్యారు. కరోనా కారణంగా ఇండస్ట్రీ షూటింగ్లు నిలిపేయడంతో ఎక్కడి వారు అక్కడికి వెళ్లిపోయారు. తిరిగి వచ్చేందుకు కూడా ఇష్టపడలేదు. కరోనాలో బయటికి వచ్చి వైరస్ అంటించుకోవడం ఎందుకులే అని మిన్నకుండిపోయారు. వెరసి ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల నుంచి తీసుకున్న అనుమతులు వృథా అయ్యాయి. కొత్త సినిమాల షూటింగ్లు ప్రారంభం కాకపోవడంతో అప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాలు ఇప్పుడు ఓటీటీల్లో విడుదల అవుతున్నాయి. కొత్త సినిమాలు లేకుండా థియేటర్లు ప్రారంభించి ఏం ఉపయోగం అన్న భావన ఇప్పుడు వాటి యాజమన్యాల్లో వచ్చేసింది.
కరోనా రూల్స్ మంట...
అన్లాక్ ప్రక్రియలో భాగంగా ఈ నెల 15 నుంచి థియేటర్లు తెరుచుకునేందుకు అనుమతి వచ్చినా కరోనా ప్రభావం కొనసాగుతుండటంతోకఠిన నిబంధనలు అమలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్గదర్శకాలు విధించాయి. బొమ్మ పడాలంటే తాము ఇచ్చిన 24 రూల్స్ను పాటించాల్సిందే అంటున్నారు. థియేటర్లను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయడానికి యంత్రాలు, ఇతర పరికరాలు, ద్రావణాలను యాజమాన్యాలు రెడీగా పెట్టుకోవాలి. థియేటర్లు, మల్టీప్లెక్స్ల్లో భౌతిక దూరం నిబంధనలు పాటించాల్సిందే. ఇవన్నీ కచ్చితంగా పాటిస్తే తమకూ ఆర్టీసీ బస్సుల పరిస్ధితి ఎదురవుతుందని యాజమాన్యాలు బెంబేలెత్తుతున్నాయి. భౌతిక దూరం నిబంధనల పేరుతో మొత్తం సీటింగ్లో మార్పులు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికిప్పుడు ఇవన్నీ చేయాలంటే ఆర్దిక వనరులు కావాలి. ఇప్పటికే కరోనా కారణంగా ఏడ నెలలుగా బొమ్మ పడక దివాలా అంచుల్లో ఉన్న యాజమాన్యాలు వీటిని భరించడం కష్టమే. అందుకే సినిమా వేయలేమంటున్నాయి.
Recommended Video
వేధిస్తున్న సిబ్బంది కొరత...
కరోనాకు ముందు సినిమా థియేటర్లలో పనిచేయడమంటే అదో ఆకర్షణీయమైన ఉద్యోగం. వేతనాలు తక్కువే అయినా సినిమా థియేటర్లలో పనిచేయడాన్ని గర్వంగా చెప్పుకునేవారు. కొత్త సినిమాల విడుదల సందర్భంగా టికెట్లు వస్తాయనో, తమ కుటుంబాలు, చుట్టుపక్కల వారికి టికెట్లు పంచే అవకాశం ఉంటుందనో థియేటర్లలో పనిచేసేందుకు చిన్న ఉద్యోగులు ఇష్టపడేవారు. చాలా థియేటర్లలో మేనేజర్లు సైతం దశాబ్దాలుగా పనిచేస్తున్న వారే ఉన్నారు. వీరంతా రిటైర్మెంట్ వయసులో ఉన్నవారే. ఏడు నెలలుగా థియేటర్లు మూతపడటంతో వీరికి ఉపాధి కరవైంది. దీంతో వీరంతా ప్రత్యామ్నాయ ఉపాధి వెతుక్కుని ఇప్పుడిప్పుడే అందులో కుదురుకుంటున్నారు. తిరిగి వీరిని థియేటర్లకు రప్పించి కరోనా మధ్య పనిచేయించడం యాజమాన్యాలకు ఇబ్బందిగా మారింది. దీంతో సిబ్బంది కొరతతో థియేటర్లు నడపలేమంటూ వారు చేతులెత్తేస్తున్నారు.