ఇక రేషన్ షాపుల స్థానంలో విలేజ్ మాల్స్....సిఎం చంద్రబాబు చేతులమీదుగా ప్రారంభం
Recommended Video

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో పౌరసరఫరాల శాఖలో విప్లవాత్మకమైన మార్పు రానుంది. ఇప్పటివరకు అర్హులైన పేదలకు సబ్సిడీ మీద నిత్యవసర వస్తువులు పంపిణీ చేసిన రేషన్ షాపులు ఇకముందు తమ రూపురేఖలు పూర్తిగా మార్చేసుకోబోతున్నాయి. సంప్రదాయ రేషన్ షాపుల స్థానంలో ఆధునిక విలేజ్ మాల్స్ రానున్నాయి. వీటికి చంద్రన్న విలేజ్ మాల్స్ గా నామకరణం చేశారు.
ఈ విలేజ్ మాల్స్ పైలెట్ ప్రాజెక్టును ఎపి సిఎం చంద్రబాబు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. విజయవాడ,గుంటూరులో ఏర్పాటు చేసిన ఈ ప్రయోగాత్మక విలేజ్ మాల్స్ ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రిలయెన్స్ సంస్థ అధినేత ముఖేష్ అంబానీలు మంగళవారం ఉదయం అమరావతిలోని సెక్రటేరియట్ నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా ప్రారంభించారు.

అంతకుముందు...ఆ తరువాత...
ముందు నేరుగా ఈ చంద్రన్న విలేజ్ మాల్స్ ప్రారంభించాలని భావించినా విజయవాడలో
భవానీ దీక్షల విరమణను దృష్టిలో ఉంచుకుని మార్చేశారు. భవాని భక్తుల కాలినడక మార్గంలో ఉన్నఈ విలేజ్ మాల్కు సిఎం డైరెక్ట్ గా వస్తే ట్రాఫిక్ ఆంక్షలు విధించాల్సి వస్తుంది. దీనివల్ల భవాని భక్తులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉన్న నేపథ్యంలో, ప్లాన్ మార్చి సెక్రటేరియట్ నుంచి ప్రారంభించటానికి ఏర్పాట్లు చేశారు. దీంతో సచివాలయం నుంచే రిమోట్ కంట్రోల్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రన్న విలేజ్ మాల్స్ ను ప్రారంభించారు.

లైవ్ లో సిఎం సందేశం..
చంద్రన్న విలేజ్ మాల్ను ప్రారంభించిన తర్వాత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం చంద్రబాబు లైవ్లో మాట్లాడారు.
ఎవరైనా తమకు రేషన్ బియ్యం వద్దనుకునే తెల్లకార్డుదారులు అంతేవిలువైన నగదుకు చంద్రన్నవిలేజ్ మాల్ లో కావాల్సిన ఆహార పదార్ధాలు కొనుగోలు చేసుకోవచ్చని ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పారు. ఏపీలోని 29 వేల చౌకధరల దుకాణాలను దశల వారీగా విలేజ్ మాల్లుగా మార్చుతామన్నారు.వాటిలో తక్కువ ధరకు, నాణ్యమైన నిత్యావసర వస్తువులను వినియోగదారులకు అందుబాటులో ఉంచుతారన్నారు.

ఎక్కడెక్కడ..పైలెట్ ప్రాజెక్టులుగా గుంటూరు నగరంలోని
శ్రీనివాసరావుపేటలో ఒక విలేజ్మాల్, విజయవాడ సర్కిల్-1 పరిధిలోని విద్యాధరపురంలో 15వ నెంబర్ చౌక దుకాణాలను చంద్రన్న విలేజ్మాల్గా అభివృద్ధి పరచాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది.
అన్నివర్గాల ప్రజలకు నాణ్యమైన నిత్యావసర సరుకులను తక్కువ ధరకే అందించేందుకు చంద్రన్న విలేజ్మాల్ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

అధ్యయనం చేశాకే...
ఇప్పటికే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న విలేజ్మాల్స్ని అధ్యయనం చేసిన అనంతరం ఈ తరహా విలేజ్ మాల్స్ మన రాష్ట్రంలో ఏర్పాటుచేసేందుకు రిలయన్స్, వాల్మార్ట్ సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకొంది. ఈ చంద్రన్న విలేజ్ మాల్స్ల్లో విక్రయం కోసం రిలయెన్స్ మొత్తం 320 రకాల సరుకులను సిద్ధం చేసింది. వీటిలో సాధారణ నిత్యావసరాలను సివిల్ సప్లయిస్ ఇవ్వనుండగా మిగతావి రిలయెన్స్ అందిస్తుంది.

మాల్స్ రెడీ...
ఈ పైలట్ ప్రాజెక్టు లోని విలేజ్ మాల్స్ కోసం సోమవారమే రిలయెన్స్ సిబ్బంది భారీ బాక్సులలో సరుకులను తీసుకు వచ్చారు. క్రమపద్దతిలో అమర్చిన
ర్యాక్ల్లో వాటిని అందంగా ఏర్పాటు చేశారు.

తగ్గింపు ధరలు...
విలేజ్మాల్లో ఉన్న నిత్యావసర వస్తువుల ప్యాకింగ్పై ఉన్న ఎంఆర్పీ కంటే 20 శాతం తక్కువ ధరకే రిలయన్స్ అందిస్తోంది.
తగ్గించిన 20 శాతంలో రేషన్ కార్డుదారునికి 12 శాతం మేర ప్రయోజనం కల్పిస్తే మిగిలిన 8 శాతం రేషన్ డీలర్కు ప్రయోజనం ఇస్తారు.
డీలర్లకు కూడ ఆదాయం చూపించాలి కాబట్టి రిలయెన్స్ సంస్థ ఇస్తున్న తగ్గింపు ప్రయోజనంలో వారికి కొంత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

విజయవంతం అయ్యేనా...
పౌరసరఫరాల శాఖకు సంబంధించి ఈ విలేజ్ మాల్స్ విప్లవాత్మకమైన మార్పు అని చెప్పకతప్పదు. సంప్రదాయ రేషన్ షాపుల పంపిణీకి అలవాటు పడ్డ వారందరూ ఈ విలేజ్ మాల్స్ ను ఏ విధంగా ఆదరిస్తారో మరికొద్ది కాలంలో తేలిపోనుంది.












Click it and Unblock the Notifications