జాతీయ మీడియాలో కథనాలు: ఏపీ అసెంబ్లీని రద్దు చేసే యోచనలో సీఎం చంద్రబాబు..?
తెలంగాణలో ముందస్తు ఎన్నికల వేడి మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ను తాకిందా..?ముందస్తు ఎన్నికలకు వెళదామని ఏపీ సీఎం చంద్రబాబు యోచిస్తున్నారా... అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. తెలంగాణలో అసెంబ్లీ రద్దు చేసి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు సై అన్నారు. ఇప్పుడు గులాబీ బాస్ను ఫాలో అయ్యేలా కనిపిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇదే విషయాన్ని ప్రముఖ జాతీయ ఛానెల్ కథనాలను ప్రసారం చేయడంతో తెలుగు తమ్ముళ్లలో కలకలం మొదలైంది.
అసెంబ్లీ రద్దుపై జాతీయ మీడియా కథనాలు
ఆంధ్ర ప్రదేశ్లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్లానే తాను కూడా ప్రభుత్వాన్ని రద్దు చేసే యోచనలో ఏపీ సీఎం చంద్రబాబు ఉన్నారంటూ అది కొద్ది రోజుల్లోనే జరగనుందని ప్రముఖ జాతీయ ఛానెల్ ఒకటి కథనాలను ప్రసారం చేసింది. ఒక వారం రోజుల సమయంలోనే దీనిపై నిర్ణయం జరుగుతుందని ఆ ఛానెల్ కథనాలు ప్రసారం చేసింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గడ్ ఎన్నికలతోనే ఏపీకి కూడా ఎన్నికలు జరగాలనే యోచనలో బాబు ఉన్నట్లు సమాచారం.
ముందస్తు ఎన్నికలకు సిద్ధమా?...చంద్రబాబుకు వైసిపి ఎమ్మెల్యే ఛాలెంజ్!
ఎలాగు తెలంగాణలో ముందస్తు ఎన్నికలు తప్పవు కాబట్టి ఏపీలో కూడా ముందస్తుకు వెళితే ఇటు తెలంగాణలో కూడా కీలకంగా మారొచ్చనే భావనలో టీడీపీ ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే చంద్రబాబు చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ చంద్రబాబు అసెంబ్లీని రద్దు చేస్తే తెలంగాణ ఏపీ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయి.
ముందస్తుకు వైసీపీ సై... టీడీపీ నై
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ రద్దు అంశం హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుత పరిస్థితులు టీడీపీకి అనుకూలంగా లేవని తెలుస్తోంది. ముందస్తు ఎన్నికలకు ప్రతిపక్షం వైసీపీ సై అంటుంటే అధికార టీడీపీ మాత్రం నై అంటోంది. జాతీయ మీడియాలో కథనాలు రావడంతో తెలుగు తమ్ముళ్లలో ఆందోళన కలుగుతోంది. అయితే మంత్రులు మాత్రం ముందస్తు ఎన్నికల అంశాన్ని ఖండించారు. ఇదిలా ఉంటే తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన సమాచారంతోనే జాతీయ మీడియా కథనాలు ప్రసారం అయినట్లు తెలుస్తోంది.అంతేకాదు ప్రతిపక్షనేత వైసీపీ అధ్యక్షుడు జగన్ జనవరి లోపే ఎన్నికలు రావొచ్చు.. క్యాడర్ అంతా ప్రిపేర్ అయి ఉండాలని సంకేతాలు ఇచ్చారు.
ముందస్తు ఆలోచనలేదు..అభివృద్ధిపై దృష్టి సారించాం
మరోవైపు ముందస్తు ఎన్నికల అంశాన్ని ఏపీ ఐటీశాఖ మంత్రి నారాలోకేష్ ఖండించారు. తాము ప్రస్తుతం అభివృద్ధిపై దృష్టిసారించినట్లు ఆయన చెప్పారు. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఐదేళ్లు నడపకపోవడం చాలా బాధాకరమని లోకేష్ అన్నారు. ఒకవేళ ఏపీ ముందస్తు ఎన్నికలకు వెళితే టీడీపీకి ప్రతికూల ఫలితాలు వస్తాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి కొన్ని పనులను ఏపీ ప్రభుత్వం హడావుడిగా ప్రారంభించడం చూస్తే ముందస్తు ఎన్నికల వాదనకు బలాన్ని చేకూరుస్తోంది. ఇదిలా ఉంటే జాతీయమీడియా టెలికాస్ట్ చేసిన ఈ కథనాలు కేవలం టీడీపీలో గందరగోళం సృష్టించేందుకే అని మరికొందరు తెలుగు తమ్ముళ్లు అభిప్రాయపడుతున్నారు.