ఢిల్లీలో బిజీగా బాబు: పలువురు కేంద్ర మంత్రులతో భేటీ, వివరాలివే
న్యూఢిల్లీ: సింగపూర్ పర్యటన ముగించుకుని నేరుగా ఢిల్లీకి చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పులువురు మంత్రులను కలుస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్సింగ్తో భేటీ అయిన ఆయన రాష్ట్రంలో నెలకొన్న వ్యవసాయ పరిస్థితులపై చర్చించారు.
భేటీ అనంతరం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ, ఆక్వా వర్సిటీల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పారు. ఈ ఏడాది రూ. 75 కోట్లు, వచ్చే ఏడాది 150 కోట్లు వ్యవసాయ రంగ అభివృద్ధికి విడుదల చేస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారని ఆయన చెప్పారు.
రాష్ట్రంలోని రైతులు మనోస్త్థెర్యం కోల్పోకుండా సమస్యలను ఎదుర్కోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న బ్లూ రెవల్యూషన్ను ఏపీ నుంచే ప్రారంభిస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారన్నారు. నదుల అనుసంధానం ద్వారా రైతులకు మంచి భవిష్యత్తు ఉందన్న చంద్రబాబు, దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో రైతుల ఆత్మహత్యలు తక్కువగా ఉన్నాయన్నారు.
అనంతరం కేంద్ర మంత్రి రాధామోహన్ సింగ్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో రైతులు ఆత్మహత్యలకు పాల్పడొద్దని, వారిని ఆదుకుంటామని చెప్పారు. వ్యవసాయ వర్శిటీ కోసం ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన వచ్చిందని భూమి కేటాయిస్తే దీనిపై కేంద్రం తగిన నిర్ణయం తీసుకుంటుందన్నారు.
కేంద్రమంత్రి అశోక్గజపతి రాజుతో చంద్రబాబు భేటీ
ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్న చంద్రబాబు పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్గజపతిరాజుతో భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్రంలో విశానాశ్రయాల ఆధునీకరణపై చర్చించనున్నారు. విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాల నుంచి సర్వీసుల పెంపుపై చర్చించనున్నారు.
చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన వెంట కేంద్రమంత్రి సుజనా చౌదరి, కంభంపాటి రామ్మోహాన్, సీఎం రమేశ్, పలువురు ఎంపీలు ఉన్నారు. భేటీ అనంతరం మంత్రి అశోక్గజపతిరాజు మీడియాతో మాట్లాడారు. గన్నవరం, భోగాపురం ఎయిర్పోర్టు, తదితర పెండింగ్ ప్రాజెక్టులపై చంద్రబాబుతో చర్చించినట్టు తెలిపారు.
త్వరలోనే పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు యత్నిస్తున్నామని చెప్పారు. అంతేకాకుండా ఇంటర్నేషనల్, డొమిస్టిక్ రంగాల్లో కొత్త సర్వీసుల ప్రతిపాదనలపై చర్చించామని అశోక్ గజపతిరాజు చెప్పారు.
హోంమంత్రి రాజ్నాథ్సింగ్తో చంద్రబాబు భేటీ
కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్తో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు.