ఎపి ప్రత్యేక హోదా కోసం...సిఎం చంద్రబాబు సైకిల్ ర్యాలీ
అమరావతి:ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ను డిమాండ్ చేస్తూ కేంద్రంపై పోరాటంలో భాగంగా సైకిల్ ర్యాలీ నిర్వహించారు సిఎం చంద్రబాబు నాయుడు. వెంకటాయపాలెం నుంచి సైకిల్ పై అసెంబ్లీకి బయలుదేరిన సిఎం చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ సైకిల్ల్ యాత్రలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు.తెలుగువారితో పెట్టుకోవద్దని...తమ పొట్టకొట్టవద్దని అన్నారు. లేదంటే గతంలో కాంగ్రెస్కు పట్టిన గతే బిజెపికి పడుతుందని ప్రధాని మోదీని చంద్రబాబు హెచ్చరించారు.
తెలుగుదేశం పార్టీపై కుట్రలు పన్నుతున్నారని, అయితే...ఈ కుట్రలు తమకు కొత్తేమీకాదన్నారు. రాజధాని అమరావతి నిర్మాణానికి రైతులు ఇష్టపూర్వకంగా భూములు ఇస్తే బలవంతంగా తీసుకున్నారని ఎక్కడ నుంచో వచ్చి మాట్లాడుతున్నారని సీఎం అన్నారు. మన రాజధానిని మనమే నిర్మించుకోవాలని, ప్రతి ఒక్కరూ విరివిగా విరాళాలు ఇవ్వాలన్నారు. రాష్ట్రాభివృద్ధికి అండగా ఉండాల్సిన పార్టీలు టీడీపీపై బురద చల్లుతున్నాయని చంద్రబాబు అన్నారు.
ఎపికి ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలు, హక్కులు సాధించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు.ఇది ఆరంభం మాత్రమేనన్నారు.పార్లమెంటు సమావేశాల్లో ఏపీపై చర్చకు కేంద్రం నిరాకరిస్తున్న తీరుకు నిరసనగా అసెంబ్లీ వరకు ఇలా సైకిల్ ర్యాలీ నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించిన సంగతి తెలిసిందే.