ప్యాకేజీయే, కానీ!: ప్రధానితో ఎలా.. వెంకయ్యతో బాబు భేటీ, రాజ్తోను
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం నాడు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుతో అరగంటపాటు ఏకాంతంగా చర్చలు జరిపారు. ఉదయం తొమ్మిదిన్నర తర్వాత వెంకయ్య నివాసానికి చంద్రబాబు వెళ్లారు.
ఈ సందర్భంగా వారి మధ్య ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ పైన చర్చ జరిగింది. ప్రత్యేక హోదా కాదని, ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేందుకే కేంద్రం సుముఖంగా ఉన్నట్లు వారి మధ్య చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ప్యాకేజీని కూడా బీహార్ ఎన్నికల వరకు ప్రకటించే అవకాశం లేదని చెప్పినట్లుగా తెలుస్తోంది.
అదే సమయంలో, కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ సహమంత్రి వెంకయ్య ఇంటికి వచ్చారు. జిఎస్టీ బిల్లుపై చర్చించేందుకు వచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు, వెంకయ్యలతో రాజ్ నాథ్ సింగ్ మాట్లాడారు. వీరి మధ్య పలు అంశాలు చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది.
కాగా, ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ తదితరాల సాధన కోసం సోమవారం రాత్రికే ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు.
ముందే వెంకయ్యతో భేటీ సమయంలో చంద్రబాబు... ప్రధానితో భేటీ సందర్భంగా ఏ తరహా వ్యూహంతో వెళితే బాగుంటుందన్న విషయంపై ఆయన వెంకయ్యతో మాట్లాడినట్లుగా కూడా తెలుస్తోంది. అంతేకాకుండా కేంద్రం వైఖరిపై కాస్తంత ముందస్తు అవగాహన కోసమే ఆయన ముందుగా వెంకయ్యతో భేటీ అయ్యారంటున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ఢిల్లీలో బిజీబిజీగా గడపనున్నారు. ఇప్పటికే వెంకయ్యతో సమావేశమయ్యారు. పదిన్నర గంటలకు ప్రధాని మోడీతే భేటీ అవుతారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12.30 గంటలకు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్తో భేటీ ఉంది.
రెండు గంటల సమయంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్తో సమావేశమవుతారు. సాయంత్రం 4 గంటలకు నీతి ఆయోగ్ సీఈఓ అరవింద్ పనగారియాతో భేటీ కానున్నారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతితో పాటు వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్తోనూ భేటీ అవుతారు.