పోలవరం ఎఫెక్ట్: ఆగమేఘాల మీద ఢిల్లీ నుంచి నాగపూర్కు చంద్రబాబు
పోలవరం ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేందుకు ఏ నిర్ణయం తీసుకోవాలనే అంశంపై ఈ నెల 24న ఢిల్లీలో భేటీ జరగనుంది. మళ్లీ టెండర్లు పిలిచి కొత్త కాంట్రాక్టర్కు అప్పగించాలా లేక పనుల వేగం పెంచేందుకు ప్రత్యామ్నా
అమరావతి: పోలవరం ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేందుకు ఏ నిర్ణయం తీసుకోవాలనే అంశంపై ఈ నెల 24న ఢిల్లీలో భేటీ జరగనుంది. మళ్లీ టెండర్లు పిలిచి కొత్త కాంట్రాక్టర్కు అప్పగించాలా లేక పనుల వేగం పెంచేందుకు ప్రత్యామ్నాయం చూడాలా తేలనుంది.
పోలవరం ప్రాజెక్టుకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని, దీని పూర్తికి సహకరిస్తామని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంగళవారం హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే మహానది- గోదావరి - కావేరీల అనుసంధానం చేయాలన్న ఆలోచనలో ఉన్నామన్నారు.
మహారాష్ట్రలోని నాగపూర్లో గడ్కరీని సీఎం చంద్రబాబు, మంత్రి దేవినేని ఉమా, ఇతర అధికారులు కలిశారు. పోలవరం కాంట్రాక్టరును మార్చలేమని, ఇప్పుడు మార్చితే అదనపు భారం పడుతుందని గడ్కరీ పేర్కొన్నట్లు మంగళవారం వార్తలు రావడం అటు, కేంద్ర జలవనరుల శాఖ అధికారులు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నట్లు తెలియడంతో చంద్రబాబు ఆగమేఘాల మీద స్పందించారు.
విశాఖ నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లాల్సిన ఆయన అనంతరం గడ్కరీ వద్ద అపాయింటుమెంట్ తీసుకుని, నాగపూర్కు వెళ్లారు. గడ్కరీతో దాదాపు రెండు గంటల పాటు చర్చించారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి చోటు చేసుకున్న పరిణామాలను పూసగుచ్చినట్లు వివరించారు.
2019లోగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడమే తమ లక్ష్యమని చంద్రబాబు చెప్పారు. కాగా, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలంటే కొత్త కాంట్రాక్టర్కు అప్పగించడమే మంచిదని చంద్రబాబు భావిస్తున్నారు. ఆ దిశగా కేంద్రాన్ని ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.