ఛాన్సివ్వకుండా.. జగన్కు చంద్రబాబు 'ఫ్రీ' చెక్: ఒక్క దెబ్బకు.., అందరికీ సమానం
ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల క్రితం నవ్యాంధ్ర రాజధాని అమరావతిని ఫ్రీ జోన్గా ప్రకటించారు. ఈ ప్రకటన ద్వారా ఆయన ఒక్క దెబ్బకు రెండు పిట్టలు కొట్టినట్లుగా కనిపిస్తోంది.
విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల క్రితం నవ్యాంధ్ర రాజధాని అమరావతిని ఫ్రీ జోన్గా ప్రకటించారు. ఈ ప్రకటన ద్వారా ఆయన ఒక్క దెబ్బకు రెండు పిట్టలు కొట్టినట్లుగా కనిపిస్తోంది. అమరావతిని ఫ్రీ జోన్గా చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్లు వస్తున్నాయి.
చంద్రబాబుపై జగన్ తీవ్ర వ్యాఖ్యలు
ఫ్రీజోన్ కోసం డిమాండ్లు
లెఫ్ట్ పార్టీ నేతలతో పాటు రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షులు బైరెడ్డి రాజశేఖర రెడ్డి కూడా ప్రీ జోన్ ఏర్పాటు చేయాలని గతంలో డిమాండ్లు చేశారు. తమ ప్రాంతంలో రావాల్సిన రాజధానిని అమరావతికి తరలించారని, కనీసం రాజధానిని ఫ్రీజోన్గా చేయాలని, లేదంటే రాయలసీమ రాష్ట్ర ఉద్యమం వస్తుందని హెచ్చరికలు కూడా వచ్చాయి.
జగన్ రాజకీయం
మరోవైపు, ప్రతి అంశాన్ని ప్రతిపక్ష నేత వైయస్ జగన్ రాజకీయం చేయాలని చూస్తున్నారని టిడిపి నేతలు భావిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు, కాపు ఉద్యమం తదితరాల పైన జగన్ పైన టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు.
జగన్కు ఛాన్సివ్వకుండా..
అమరావతిని ఫ్రీజోన్గా చేయకుంటే రాయలసీమ ప్రాంతంలో జగన్ మరింత బలపడే అవకాశాలున్నాయని టిడిపి భావించిందని అంటున్నారు. ఓ వైపు డిమాండ్లు, మరోవైపు జగన్ను దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు జాగ్రత్త పడ్డారనే వాదనలు వినిపిస్తున్నాయి. తద్వారా జగన్కు మరో ఛాన్స్ ఇవ్వకుండా చంద్రబాబు ప్రకటన చేశారని అంటున్నారు.
అమరావతి ఫ్రీజోన్.. అందరికీ సమాన అవకాశాలు
రాజధాని అమరావతిని ఫ్రీజోన్ చేస్తున్నామని, అమరావతి పరిధిలో ఉద్యోగ, నియామకాల్లో రాయలసీమ, దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు సమాన అవకాశాలు ఉంటాయని చంద్రబాబు రెండు రోజుల క్రితం ప్రకటించారు. కర్నూలు జిల్లా ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు సందర్భంగా, అలాగే అనంతపురం కల్లూరు మండలం తడకనపల్లె గ్రామంలో జన్మభూమి - మా ఊరు కార్యక్రమం సందర్భంగా.... రెండు చోట్ల అమరాతిని ఫ్రీజోన్గా చేస్తున్నట్లు చెప్పారు.
కమిషనరేట్ కూడా ఫ్రీజోన్
అమరావతిలో ఏర్పాటు చేయబోయే పోలీస్ కమిషనరేట్ను ఫ్రీజోన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రస్థాయి కార్యాలయాలన్నింటినీ ఫ్రీజోన్గా కొనసాగించడంతోపాటు కమిషనరేట్ను కూడా ఫ్రీజోన్ పరిధిలోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
సమైక్య ఏపీలో హైదరాబాద్ రాజధాని ఉండగా..
సమైక్య రాష్ట్రంలో హైదరాబాద్ రాజధానిగా ఉన్నప్పుడు సిటీ పోలీస్ ఫ్రీజోన్గా ఉండేది. ఈ మేరకు రాష్ట్రపతి ఉత్తర్వుల్లో 14ఎఫ్ క్లాజును చేర్చారు. అయితే కొద్దికాలం కిందట 14ఎఫ్ తొలగించారు. విభజన తర్వాత 14ఎఫ్ లేని రాష్ట్రపతి ఉత్తర్వులే నవ్యాంధ్రకు వర్తిస్తుండడంతో ప్రభుత్వం దీనిపై చర్చించి.. ఇతర ప్రభుత్వ ఉద్యోగాల మాదిరిగానే రాజధాని పోలీసింగ్ను కూడా ఫ్రీజోన్గా ప్రకటిస్తూ 14ఎఫ్ ఏపీకి మాత్రమే వర్తించేలా, లేదంటే ఆ తరహాలో మరో క్లాజ్ చేర్చాలని కోరుతూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపనుంది.
పోలీసింగ్
విభజన తర్వాత మిగతా అన్ని విషయాల్లో స్పష్టత ఉన్పప్పటికీ రాజధాని పోలీసింగ్ విషయంలో కొంత సందిగ్ధత నెలకొంది. సాంకేతికంగా చూస్తే ప్రస్తుతానికి నవ్యాంధ్రకు రాజధాని ప్రాంతం అంటూ లేదు. అమరావతి రాజధాని అని చెప్తున్నప్పటికీ భౌగోళికంగా సచివాలయ ప్రాంతం అమరావతి కాదు. శాశ్వత రాజధాని ఏర్పాటైన తర్వాత సీఆర్డీఏ పరిధి మొత్తాన్ని అమరావతిగా పరిగణిస్తారు.
మరి ఈలోపు ఉద్యోగ నియామకాలు ఎలా అన్న అనుమానాలను పలువురు వ్యక్తం చేశారు. అయితే రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రస్థాయి కార్యాలయ పోస్టులన్నీ ఫ్రీజోన్ పరిధిలోకి వస్తాయని ప్రభుత్వం ఇది వరకే స్పష్టం చేసింది. ఆ మేరకే తాజాగా సచివాలయంలోని అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్(ఏఎ్సవో) పోస్టులను రాష్ట్రం యూనిట్గా భర్తీ చేయాలని నిర్ణయించింది.
రాష్ట్రం యూనిట్గా..
ఒక్క సచివాలయ పరిధిలోనే కాకుండా విజయవాడ, గుంటూరు సహా రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో రాష్ట్రస్థాయి ప్రభుత్వ కార్యాలయం ఉన్నా అది ఫ్రీ జోన్గానే కొనసాగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాల వరకూ స్పష్టత ఉన్నప్పటికీ పోలీస్ ఉద్యోగాల విషయంలోనే గందరగోళం నెలకొంది. సీఎం చంద్రబాబు నిపుణులతో చర్చించారు
రాజధాని ప్రభుత్వ కార్యాలయాలను ఫ్రీజోన్గా పరిగణించడానికి ప్రత్యేకంగా కేంద్రం ఎలాంటి ఉత్తర్వులనూ ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారని తెలుస్తోంది. కేవలం కేంద్రానికి సమాచారం పంపితే సరిపోతుందని చెప్పారట. మొత్తం రాజధాని ప్రాంతానికీ వర్తించే కమిషనరేట్లో ఉద్యోగాలను రాష్ట్రం యూనిట్గా భర్తీ చేస్తారు.
ఫ్రీజోన్ పైన ఆదేశాలు
విభజనకు ముందు 14 ఎఫ్ తొలగించారు. ఈ ఎఫ్ క్లాజ్ లేనందున నవ్యాంధ్ర రాజధాని నగర పోలీస్ ఫ్రీ జోన్ కాకుండా పోయింది. అమరావతి ప్రాంతంలో ప్రస్తుతానికి తాత్కాలిక సచివాలయం మాత్రమే ఉంది. భవిష్యత్తులో శాశ్వత రాజధాని ఏర్పడి దాని పరిధి మరింత విస్తరించనుంది. ఇప్పుడు రాజధాని అమరావతి కోసం ఒక సబ్ డివిజన్ మాత్రమే ఉంది.
త్వరలోనే అమరావతి పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం విజయవాడ, గుంటూరులో ఉన్న పోలీస్ కమిషరేట్లు యథావిధిగా కొనసాగుతాయి. వాటిలో నియామకాలు కూడా పాత పద్ధతిలోనే ఉంటాయి. అమరావతి పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేశాక అది మాత్రం ఫ్రీ జోన్ పరిధిలోకి వస్తుంది. ఇందుకు కేంద్రానికి ప్రతిపాదన పంపించాలని సీఎం ఆదేశించారు.