హోదా ఇస్తే తప్ప ప్రజలు శాంతించరు: ప్రధానితో చంద్రబాబు
న్యూఢిల్లీ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యనట రెండో రోజు కొనసాగుతోంది. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్రమోడీతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో సుమారు 40 నిమిషాల పాటు సాగింది. ఈ సమావేశం సందర్భంగా ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కృష్ణా పుష్కరాలకు రావాలని ఆహ్వానించారు.
అనంతరం ఏపీకి ప్రత్యేక హోదా అంశంతో పాటు విభజన సమస్యలపై ఇరువురి మధ్య ప్రధానంగా చర్చ జరిగింది. విభజన చట్టంలో ఉన్న అనేక అంశాలను పరిష్కరించాలని మోడీకి చంద్రబాబు సూచించారు. విభజన తర్వాత రెవెన్యూ లోటులో ఉన్న ఏపీ రాష్ట్రం వేగవంతం అభివృద్ధి చెందేలా సాయం అందించాలని కోరారు.
ప్రత్యేకహోదా మినహా ఏది ఇచ్చిన ప్రజలు శాంతించరని మోడీతో చంద్రబాబు తేల్చి చెప్పారు. ఏపీకి ప్రత్యేకహోదా అంశం రెండు పార్టీలు ఇచ్చిన హామీగా ఆయన గుర్తు చేశారు. హోదాపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ప్రధానికి సూచించినట్లు చంద్రబాబు చెప్పారు.
దీనికి ప్రతిగా ప్రధాని కూడా ఆలస్యం చేయకుండా హోదాపై నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లు చంద్రబాబు వెల్లడించారు. మోడీతో చంద్రబాబు సమావేశం సందర్భంగా 12 అంశాలతో కూడిన లేఖను ఇచ్చారు. ప్రత్యేకహోదాపై ఆర్ధిక మంత్రి జైట్లీ రాజ్యసభలో చేసిన ప్రకటన ఏపీలో అలజడి సృష్టించిందని మోడీతో చెప్పారు.
ప్రత్యేక హోదాను ఇచ్చే ప్రక్రియ ఎంత ఆలస్యమైతే ప్రజల్లో అంత మేరకు నమ్మకం పోతుందని, దీని ఫలితంగా ఇద్దరమూ నష్టపోతామని ప్రధానితో స్పష్టంగా చెప్పారు.
రాజకీయాల్లో విశ్వసనీయత ఎంతో ముఖ్యమని తాను మోడీకి వివరించానని, త్వరగా నిర్ణయం తీసుకోకుంటే టీడీపీ, బీజేపీలకు నష్టమని చెప్పానని బాబు అన్నారు.
అయితే హోదా కాకుండా ఏపీకి ఇచ్చే సాయంపై చంద్రబాబుకు మోడీ వివరించారని తెలుస్తోంది. ఈ భేటీలో ఆర్థికశాఖ మంత్రి అరుణ్జైట్లీ కూడా పాల్గొన్నారు. చంద్రబాబు భేటీ అనంతరం శుక్రవారం మధ్యాహ్నాం ప్రధానమంత్రి నరేంద్రమోడీతో విడిగా టీడీపీ ఎంపీలు కలిశారు.
ప్రభుత్వం ఇచ్చిన వాగ్ధానాన్ని నిలబెట్టుకోవాలని మోడీని ఎంపీలు కోరారు. గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని టీడీపీ ఎంపీలు ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన మీ సమస్యే... నా సమస్యే అంటూ ప్రధాని మోడీ టీడీపీ ఎంపీలతో చెప్పినట్లుగా తెలుస్తోంది. ఏపీపై మోడీ సానుకూలంగా ఉన్నారని టీడీపీ ఎంపీలు చెప్పారు.
ప్రధాని మోడీతో సమావేశం ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రమంత్రులు సురేశ్ ప్రభు, వెంకయ్య నాయుడులతో భేటీ అయ్యారు. కృష్ణా పుష్కరాలను రావాలని ఆహ్వానించారు. శుక్రవారం ఉదయం పార్లమెంట్కు చేరుకున్న చంద్రబాబు ముందుగా కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్తో భేటీ అయ్యారు.
అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్ కుమార్తో సమావేశమైన పుష్కరాలకు రావాలని ఆహ్వానించారు. లోక్సభ స్పీకర్ మహాజన్తో పాటు కేంద్ర మంత్రులు జవదేకర్, అహ్లువాలియాను కలిసిన కృష్ణాపుష్కరాలకు రావాల్సిందిగా ఆహ్వానం పలికారు.