జగన్కు కౌంటర్: వ్యక్తిగతంగా తిట్టడం సంస్కారం కాదు: బాబు
పాదయాత్ర ప్రారంభించే ముందు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ చేసిన విమర్శలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించారు.
అమరావతి: పాదయాత్ర ప్రారంభించే ముందు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ చేసిన విమర్శలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించారు. వ్యక్తి గతంగా తిట్టడం తెలుగువారి సంస్కారం కాదన్నారు చంద్రబాబునాయుడు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది ఇడుపులపాయలో కన్పించడం లేదా అని బాబు ప్రశ్నించారు.
నవంబర్ 6వ, తేది నుండి వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పాదయాత్రను ప్రారంభించారు. పాదయాత్ర ప్రారంభించే ముందు వైఎస్ జగన్ ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై తీవ్రమైన విమర్శలు గుప్పించారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలను చంద్రబాబునాయుడు అమలు చేయలేదని జగన్ విమర్శలు గుప్పించారు.అసెంబ్లీలోపల, బయట టిడిపి ఏ రకంగా వ్యవహరిస్తోందనే విషయాలను కూడ ఆ పార్టీ నేతలు ప్రస్తావించారు.
వ్యక్తిగతంగా తిట్టడం సంస్కారం కాదు
రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ది వైసీపీ చీఫ్ వైఎస్ జగన్కు కన్పించడం లేదా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. ప్రభుత్వం ఏం చేసిందో ఇడుపాయలలో తెలుస్తోందన్నారు. అదీ కూడ జగన్కు కన్పించడం లేదా అని ఆయన ప్రశ్నించారు.వ్యక్తిగతంగా తిట్టడం తెలుగువారి సంస్కారం కాదని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.
అసెంబ్లీ సమావేశాల బహిష్కరణ జగన్ విజ్ఞతకే
అసెంబ్లీలో ప్రజల సమస్యలపై చర్చించాలి. కానీ.. సమావేశాలను బహిష్కరించడం జగన్ విజ్ఞతకే వదిలేద్దామని చంద్రబాబు అన్నారు. అసెంబ్లీలో టీడీఎల్పీ తరుపున 28 అంశాలు చర్చించాలని నిర్ణయం తీసుకున్నామని చంద్రబాబు చెప్పారు. అసెంబ్లీలో సభ్యులు హుందాతనంగా నడుచుకోవాలని, మంత్రులు వారి శాఖల ద్వారా ప్రజలకు చేసిన మేలును అసెంబ్లీలో వివరించాలని సూచించారు.
పాదయాత్రపై టిడిపి వ్యూహమిదే
వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పాదయాత్ర సాగుతున్న సమయంలో ఆ పార్టీపై మైండ్గేమ్ ఆడాలని టిడిపి నాయకత్వం భావిస్తోంది. ఆ పార్టీ నుండి ఎమ్మెల్యేలు, పార్టీకి చెందిన ముఖ్యులను తమ పార్టీలోకి వచ్చేలా చేయాలని టిడిపి ప్లాన్ చేస్తోంది.ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలతో టిడిపి నాయకత్వం ప్లాన్ చేస్తోందనే ప్రచారం సాగుతోంది. కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు టిడిపిలో చేరనున్నారనే ప్రచారం సాగుతోంది.
అసెంబ్లీలో టిడిపి ఏం చేస్తోంది
అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం లేదు. బిజెపిసభ్యులు మాత్రమే ఉంటారు. అయితే బిజెపి కూడ టిడిపితో మిత్రపక్షంగా ఉంది. ఈ తరుణంలో సభ ఏకపక్షంగానే సాగే అవకాశం లేకపోలేదని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సభ సంప్రదాయాలకు విఘాతం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చంద్రబాబునాయుడు పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు. అంతేకాదు ప్రజల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలని ఆ పార్టీ భావించింది.